న్యూఢిల్లీ, ఆగస్టు 9: మొబైల్ టారిఫ్ల ధరలు పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ప్రస్తుతం ప్లాన్ల రీచార్జ్ రేట్లు తక్కువగా ఉన్నాయన్న ఆయన.. దేశంలో టెలికం సేవలు చాలా చౌకగా లభిస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక్కో వినియోగదారుని నుంచి వస్తున్న సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ.183గా ఉందని, త్వరలోనే ఇది రూ.200 కాగలదన్న విఠల్.. టారిఫ్ల పెంపుతో దీన్ని రూ.300లకు చేర్చాల్సి ఉందని ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే 4జీ ప్లాన్ల ధరలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో విఠల్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే 5జీ సేవల ధరలు మోత మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2024కల్లా దేశమంతటా 5జీ
ఈ నెలలోనే 5జీ సేవలు మొదలుపెట్టనున్నట్టు ఎయిర్టెల్ మరోమారు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2024 మార్చికల్లా దేశంలోని అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాలకు 5జీ నెట్వర్క్ను విస్తరిస్తామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది.