న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఈ నెలలోనే 5జీ సేవలను భారతీ ఎయిర్టెల్ ప్రారంభించాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే టెలికం నెట్వర్క్ ఎక్విప్మెంట్, మొబైల్ తయారీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, సామ్సంగ్లతో 5జీ నెట్వర్క్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు బుధవారం ఎయిర్టెల్ ప్రకటించింది. 5జీ స్పెక్ట్రం వేలం సోమవారమే (ఆగస్టు 1) ముగిసిన విషయం తెలిసిందే.
ఈ నెల 10లోగా వేలంలో బిడ్డింగ్ వేసిన టెలికం సంస్థలకు స్పెక్ట్రం కేటాయింపులు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతీ విదితమే. దీంతో ఎయిర్టెల్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే ఈ నెల ద్వితీయార్ధం నుంచి 5జీ సర్వీసులను మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. ఈ వేలంలో 900, 1800, 2100, 3300 మెగాహెట్జ్లతోపాటు 26 గిగాహెట్జ్ బ్యాండ్లలో మొత్తం 19,867.8 మెగాహెట్జ్ల స్పెక్ట్రంను రూ.43,084 కోట్లకు ఎయిర్టెల్ దక్కించుకున్నది. కాగా, ఎరిక్సన్, నోకియాలతో దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న సంబంధాలు.. దేశవ్యాప్తంగా 5జీ కనెక్టివిటీకి దోహదం చేయగలవని ఈ సందర్భంగా ఎయిర్టెల్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
సామ్సంగ్తోనూ ఈ ఏడాది నుంచే కలిసి ముందుకెళ్తామన్నది.‘ఆగస్టులోనే 5జీ సేవలను అందుబాటులోకి తేనున్నామని ప్రకటించేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ భాగస్వాములతో కలిసి మా వినియోగదారులకు 5జీ అనుభవాన్ని కల్పిస్తున్నాం’ అని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. అలాగే 5జీ రాకతో భారత డిజిటల్ ఎకానమీలో సరికొత్త విప్లవం మొదలు కానుందన్నారు.