న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతోంది. ఈ విమానాల నిర్వహణ ఖర్చు రూ. 1.10 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. విమానాల వ్యవధి బట్టి మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొన్న నేపథ్యంలో పొరుగు దేశాల నుంచి డ్రీమ్లైనర్ బోయింగ్ 787 విమానంతో ఎయిర్ ఇండియా భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది.
రొమేనియా, హంగేరి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది భారతీయులను స్వదేశానికి చేర్చింది. ఈ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. బోయింగ్తో చార్టర్డ్ ఫ్లైట్ను నడపాలంటే గంటకు రూ.7-8లక్షల వరకు ఖర్చవుతోందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం.. దూరం ఎంత అన్న దానిపై ఖర్చు ఉంటుందని పేర్కొన్నాయి. ఇవే కాకుండా మొత్తం ఖర్చులో సిబ్బంది, ఇంధనం, నావిగేషన్, ల్యాండింగ్.. పార్కింగ్ చార్జీలు సైతం ఉంటాయని చెప్పాయి.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరి రాజధాని బుడాపెస్ట్లకు విమానాలను నడుపుతున్నది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ (FlightAware) ప్రకారం.. శనివారం బుకారెస్ట్ నుంచి ముంబైకి చేరిన విమానం దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణించింది. అలాగే బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి చేరిన విమానం సైతం దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణించి వచ్చింది. ప్రతి విమానం ఖర్చు గంటకు రూ.7-8లక్షలకుపైగా ఖర్చవుతుంది. ఒక విమాన ప్రయాణం వ్యవధి 14 గంటలుగా ఉంటుందని అంచనా వేయగా.. సమయం పెరిగిన కొద్దీ మొత్తం వ్యయం పెరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.