న్యూఢిల్లీ : ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు ఆస్ట్రేలియా అధికారులు నిరాకరించడంతో ఎయిర్ ఇండియా విమానం సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమాన సిబ్బందిలో ఒకరు కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్షించడమే కారణమని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం విమానం సిడ్నీ బయలుదేరే ముందు సిబ్బందికి ఢిల్లీలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. ఆదివారం ఉదయం సిడ్నీకి చేరిన అనంతరం అక్కడ అధికారులు అందరికీ మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ఫలితాలు సోమవారం వెలువడగా.. ఇందులో ఒకరికి పాజిటివ్గా వచ్చింది.
దీంతో సిడ్నీ – ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కేవలం సిబ్బంది, సరుకుతో సోమవారం సిడ్నీ నుంచి విమానం బయలుదేరిందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించిన వ్యక్తిని సిడ్నీలో ఐసోలేషన్లో ఉంచారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని మే 15 వరకు ఆస్ట్రేలియా.. భారత్ విమానాలను మంగళవారం నిషేధించిన విషయం తెలిసిందే.