పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఏఐఎన్ఆర్సీ చీఫ్ ఎన్ రంగస్వామి శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. లెఫ్టినెంట్ గవరనర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్నివాస్లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. పార్టీ వర్గాల ప్రకారం.. రంగ స్వామి ఒక్కరే బాధ్యతలు స్వీకరించనుండగా.. పార్టీ సహా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా రాబోయే రోజుల్లో ప్రమాణం చేస్తారని చెప్పాయి. జనవరిలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన నమశ్శివాయానికి ఉప ముఖ్యమంత్రి పదవికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే, నియామకంపై కేంద్ర నాయకత్వం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సీ పార్టీ పోటీ చేసిన 16 స్థానాల్లో పదింటిని గెలుచుకుంది. బీజేపీ తొమ్మిది స్ధానాల్లో పోటీ చేయగా.. ఆరు చోట్ల విజయం సాధించింది. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా.. కూటమి 16 స్థానాలు సాధించింది. మరో ఆరుగురు స్వతంత్రులు సభకు ఎన్నికవగా.. వారంతా రంగస్వామి మద్దతుదారులే. డీఎంకే 13 స్థానాల్లో పోటీ చేయగా ఆరు, కాంగ్రెస్ 14 స్థానాల్లో పోటీ చేయగా.. రెండింట విజయం సాధించింది.