హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అనుచిత వ్యాఖ్యలు చేసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని, ఆయనను సభ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఇదే విషయమై ఒక లేఖను కూడా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194ను ఉపయోగించి రాజాసింగ్ శాసన సభ్యత్వంపై వేటు వేయాలని కోరారు. సోమవారం ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వర్గం గురించి అనుచితంగా మాట్లాడారని, ఇది దేశవ్యాప్తంగా ఆ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు. శాసనసభ్యుడిగా రాజాసింగ్ రాజ్యాంగ ప్రమాణాలను ఉల్లంఘించారని, సౌభ్రాతృత్వం, సమభావన, లౌకికవాదాన్ని కించపరిచే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజాసింగ్ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఇదే విధంగా ప్రవర్తించినప్పుడు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో శాసనసభ్యుడిగా ఉండేందుకు ఆయన అనర్హుడని లేఖలో పేర్కొన్నారు. శాసనసభకు ఉన్న అధికారాలను ఉపయోగించి రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తిచేశారు.
చర్యలుంటాయా? సర్వత్రా ఇదే చర్చ
రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఇదే శాసనసభలో, స్పీకర్గా మధుసూదనాచారి ఉన్నపుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సభ నుంచి బహిష్కరించారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆనాడు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సభ్యుల కోరిక మేరకు చర్యలు తీసుకొన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకుంటారా.. లేదా? అన్నదానిపై చర్చ జరుగుతున్నది. ఆయన వ్యాఖ్యలను అన్ని పార్టీలు కూడా ఖండించాయి. సొంతపార్టీ బీజేపీ సస్పెండ్ చేసింది. వీటన్నింటి నేపథ్యంలో స్పీకర్ ఎలా స్పందిస్తారన్న చర్చ జరుగుతున్నది. సెప్టెంబర్ 14 లోపు శాసనసభను సమావేశపర్చాల్సి ఉన్నది. శాసనసభలో రాజాసింగ్ అంశంపై చర్చ పెడ్తారా.. నేరుగా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే.