ప్రభుత్వ విప్ బాల్క సుమన్
కమలాపూర్, అక్టోబర్ 17: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని విప్ బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం కమలాపూర్లో రజక కులస్థులతో సమావేశమయ్యారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం కల్యాణలక్ష్మి, ఆసరాపెన్షన్లు, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, దళితబంధులాంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని బాల్క సుమన్ తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. బీజేపీ చేసిన నల్లచట్టాలను వ్యతిరేకించిన ఈటల.. అదే బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటల.. గెలిస్తే ఏంచేస్తారు?
ప్రజలకు ఏం చేస్తారో ఈటల రాజేందర్ ఎక్కడా చెప్పట్లేదు. నల్ల చట్టాలు రద్దు చేయిస్తారో?, పెట్రో ల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తారో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి. ఓటమి భయంతోనే ఈటల ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. ఉపఎన్నికలో లబ్ధి కోసం కుట్టుమిషన్లు, బొట్టు బిళ్లలు పంచుతున్నారు. దళితబంధుపై విషప్రచారాన్ని దళితులు తిప్పికొట్టాలి.
గ్యాస్ ధరలపై బీజేపోళ్లను నిలదీయండి
కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజల నడ్డీ విరుస్తున్నది. రైతులు పండించిన దొడ్డు వడ్లు కొననంటున్నది. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను వాటిమీద నిలదీయండి. గెలిస్తే వారేం చేస్తారో ప్రశ్నించండి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ నాయకులు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.