న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సర్జరీలకు మాత్రమే ఎయిమ్స్లో అనుమతి ఇవ్వనున్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఔట్ పేషెంట్ల రిజిస్ర్టేషన్ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిబంధన శనివారం నుంచి అమల్లోకి రానుంది. అనవసరంగా ఆస్పత్రులకు ఎవరూ రావొద్దు.. అత్యవసరమైతేనే రావాలని సూచించారు. రోగులు వైద్యులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1.27 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో గురువారం 7,437 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇంత సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీ గవర్నమెంట్ ఏప్రిల్ 30వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ విధించింది.