న్యూఢిల్లీ : డ్యూటీల్లో ఉన్న సమయాల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి టీ, స్నాక్స్ తీసుకురావొద్దని ఎయిమ్స్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డర్స్ జారీ చేశారు. కార్డియో, న్యూరో సైన్స్ విభాగాల పరిశీలనకు వెళ్లినప్పుడు సెక్యూరిటీ గార్డు టీ, స్నాక్స్ తీసుకెళ్తున్న దృశ్యాలు డైరెక్టర్ శ్రీనివాస్ కంట పడ్డాయి. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. టీ, స్నాక్స్ తీసుకొచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ను తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. సెక్యూరిటీ గార్డులను నియమించింది కేవలం రక్షణ కోసమే అని పేర్కొన్నారు. డాక్టర్లకు సేవలు చేయడానికి కాదన్నారు. ఆస్పత్రిలోని వార్డుల్లో రక్షణగా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డులను ఇతర పనులకు వినియోగించొద్దని చెప్పారు. ఒక వేళ క్యాంటీన్కు టీ, స్నాక్స్ తీసుకెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు వస్తే ఇవ్వొద్దని సూచించారు. అలా జరిగితే క్యాంటీన్ ఇంచార్జిపై చర్యలు తీసుకుంటామని ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు.