న్యూఢిల్లీ : కొవిడ్-19 కట్టడికి వాడుతున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో బ్లడ్ క్లాట్స్ పెరుగుతున్న ఉదంతాలు ఇప్పటివరకూ వెలుగుచూడ లేదని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో రక్తం గడ్డ కట్టడం పెరుగుతున్న కేసులను తాము చూడలేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేసిన వ్యాఖ్యల దిశగానే గులేరియా స్పందించారు. ఐరోపా దేశాలలతో పాటు బ్రిటన్, భారత్ సహా పలు దేశాల్లో ఈ వ్యాక్సిన్ను వినియోగిస్తున్నారని వ్యాక్సిన్ పరీక్షల సమయంలోనూ ఈ వ్యాక్సిన్కు వ్యతిరేకంగా ఎలాంటి ఫలితాలు రాలేదని ఆయన గుర్తుచేశారు.
ఈ వ్యాక్సిన్తో బ్లడ్ క్లాట్స్ ముప్పు పెరుగుతోందనడానికి ఇతర ప్రాంతాల నుంచి తగినంత డేటా లేదని ఎయిమ్స్ చీఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్ సహా పలు ఐరోపా దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ప్రస్తుతం నిలిపివేశారు. ఇటలీ, పోర్చుగల్, స్లొవేనియా లాట్వియా, ఇండోనేషియాల్లోనూ ఈ వ్యాక్సిన్లను నిలిపివేశారు. కాగా, కొద్దిమందిలో బ్లడ్ క్లాట్స్కు సంబంధించి ఆందోళన వ్యక్తమవుతోందని, ఇది ఏ ప్రభుత్వానికైనా కలవరం కలిగించేదేనని కొవిడ్-19 రీసెర్చర్-ఐఐసీబీ, ఇమ్యూనాలజిస్ట్ దిప్యమన్ గంగూలీ పేర్కొన్నారు. ఇక తమ వ్యాక్సిన్ పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి చేయబడిందని ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటనలో పేర్కొంది.