హైదరాబాద్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్గా పేర్కొంది. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కొత్త గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆ పార్టీ చిరంజీవిని 2027 వరకు పీసీసీ డెలిగేట్గా పేర్కొంటూ గుర్తింపు కార్డులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి మంగళవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ డెలిగేట్గా గుర్తిస్తూ ఐడీ కార్డ్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? కేవలం తన గాడ్ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ వ్యాఖ్య చేశారా? అని చర్చ సాగుతున్నది. ఇప్పటికే చిరంజీవి జనసేన తరఫున మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా.. ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్నది.