స్కీమ్ను వెనక్కి తీసుకోవాలి
దేశవ్యాప్తంగా ఎస్కేఎం నిరసనలు
న్యూఢిల్లీ, జూన్ 24: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు చేపట్టింది. అగ్నిపథ్ పథకం దేశ వ్యతిరేకమని, వెంటనే ఈ స్కీమ్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించింది. ఈ నిరసనల్లో యువత, పౌరసంఘాలు పాల్గొన్నాయని ఎస్కేఎం తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్లలో నిరసనలు చేపట్టినట్టు వెల్లడించింది. అగ్నిపథ్ పథకం కింద నాలుగేండ్లు సైన్యంలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత 3/4 శాతం మంది అగ్నివీరులు రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేసింది. అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొన్న యువతపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.
నాక్కూడా పెన్షన్ వద్దు: వరుణ్గాంధీ
అగ్నిపథ్ పథకంపై మోదీ ప్రభుత్వం మీద బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ‘అగ్నివీరులు స్వల్పకాలం దేశానికి సేవ చేస్తారు. వారికి పింఛన్ పొందే హక్కులేదు. ప్రజాప్రతినిధులకు మాత్రం ఈ సదుపాయం ఎందుకు కల్పిస్తున్నారు? దేశాన్ని రక్షించే వారికే పింఛన్ సదుపాయం లేకపోతే.. నేను కూడా పెన్షన్ వదులుకోవడానికి సిద్ధం. ఎంపీలు, ఎమ్మెల్యేలు మీరు ఏమంటారు?’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, వాయుసేనలో అగ్నిపథ్ కింద నియామకాల కోసం శుక్రవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ జూలై 5. అగ్నిపథ్ పథకంలో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ వెల్లడించారు.