న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసులు (Bus service) త్వరలో పునరుద్ధరించనున్నారు. త్రిపురలోని అగర్తల నుంచి ఢాకా మీదుగా కోలకతాకు బస్సు సర్వీసు వచ్చే నెల 10న మళ్లీ ప్రారంభంకానున్నాయి. కరోనా కారణంగా రెండేండ్ల క్రితం ఈ రూట్లో బస్సులను నిలిపివేశారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో రవాణా సదుపాయాలను తిరిగి అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
త్రిపుర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ఈ సర్వీసు మొత్తం 500 కిలోమీటర్లు ప్రయాణించనుంది. దీనిద్వారా అగర్తల నుంచి ఢాకా మీదుగా కోల్కతాకు 19 గంటల్లోనే చేరుకోవచ్చు. అదే రైలులో అయితే 35 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. బస్సు టికెట్లను వచ్చే నెల 1 నుంచి ఆన్లైన్లో బుక్చేసుకోవచ్చని తెలిపారు.
కాగా, భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో రైలు సర్వీస్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నది. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగురి నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మధ్య మిటాలి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుంది. అలాగే కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లకు పైగా భారత్, బంగ్లాదేశ్ మధ్య నిలిచిపోయిన రైలు సేవలను ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. మే 29న భారత్-బంగ్లాదేశ్ మైత్రీ ఎక్స్ప్రెస్ రైలు, మే 30న బంధన్ ఎక్స్ప్రెస్ రైలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించారు.