న్యూఢిల్లీ: సోషల్మీడియా ద్వారా ఫేమస్ అయి రెస్టారెంట్ పెట్టుకున్న బాబా కా దాబా కాంతా ప్రసాద్ కథ మొదటికొచ్చింది. కరోనా లాక్డౌన్ వల్ల నష్టపోయిన కాంతా ప్రసాద్ తన రెస్టారెంట్ మూసివేసి తిరిగి బాబా కా దాబా ఓపెన్ చేశాడు. లాక్డౌన్కు ముందు రోజూ రూ.3,500 ఆదాయం వస్తుండగా అదికాస్తా రూ. వెయ్యికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశాడు. ఆ ఆదాయం తమ కుటుంబంలోని ఎనిమిది మందికి సరిపోదని తెలిపాడు.
దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఈ బాబా కా దాబా ఉంది. ఎంతో రుచికరమైన ఆహార పదార్ఠాలున్నా ఎవరూ రావడం లేదని కాంతాప్రసాద్ ఏడుస్తున్న వీడియోను యూట్యూబర్ గౌరవ్ వాసన్ సోషల్మీడియాలో షేర్చేశాడు. దీంతో కాంతా ప్రసాద్ రాత్రికేరాత్రే ఫేమస్ అయిపోయాడు.
లక్షల రూపాయాల విరాళాలు వచ్చాయి. అలాగే, బాబా కా దాబాకు జనం క్యూకట్టారు. ఇలా వచ్చిన డబ్బుతో కాంతాప్రసాద్ తన పాత అప్పులు తీర్చుకున్నాడు. తన పిల్లలకు ఫోన్లు కొన్నాడు. ఓ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. కానీ, వృద్ధుడైన కాంతాప్రసాద్పై విధి మళ్లీ పగబట్టింది. రెస్టారెంట్లో నష్టాలు రావడంతో తిరిగి తనకు లైఫ్ ఇచ్చిన రోడ్సైడ్ బాబా కా దాబాకు వచ్చేశాడు.