న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతుంటే తాజాగా వంట నూనె ధరలూ వంటగది బడ్జెట్కు షాకిస్తున్నాయి. గత ఏడాదిగా వంట నూనెల ధరలు ఏకంగా 30 నుంచి 60 శాతం పైగా ఎగబాకడంతో గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. వంట నూనెలతో పాటు పామాయిల్, సోయా నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఏడాది కిందట రూ 100 పలికిన కిలో వంట నూనె ప్రస్తుతం ఏకంగా దాదాపు రూ 150కిపైగా ఎగబాకింది. వంట నూనెలు సలసలా కాగుతుండటంతో వంటింటి బడ్జెట్ పెరిగి సామాన్యులు, మధ్యతరగతి సహా పేద మహిళలు వంట అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరా తగ్గడంతో నూనెలకు డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో ధరలు చుక్కలు తాకుతున్నాయి. చైనాలో సోయాబీన్కూ డిమాండ్ పెరిగింది. మరోవైపు బ్రెజిల్, అర్జంటీనాల్లో ప్రతికూల వాతావరణంతో నూనెల ఉత్పత్తి దెబ్బతింది. మరోవైపు దేశీ మార్కెట్లోనూ వినియోగం పెరగడంతో పాటు పండగ సీజన్లో వంటనూనెలకు డిమాండ్ ఎగబాకే క్రమంలో రాబోయే రోజుల్లో నూనెల ధరలు మరింత పెరుగుతాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.