Trivikram Srinivas | తెలుగు ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల జాబితా చూసుకుంటే అందులో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులకు ఫేవరేట్గా నిలిచాయి. ఖలేజా సినిమా ఫ్లాప్ అయినా కూడా చాలా మందికి అది హాట్ ఫేవరేట్. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది ఖలేజా. దానికి ముందు మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కించిన అతడు సినిమా కూడా అంతే. థియేటర్లలో ఆ సినిమా భారీ లాభాలు తీసుకురాకపోయినా.. బుల్లితెరపై మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని రికార్డులు సృష్టించింది.
తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు గురూజీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా కోసం ఆయన 14 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక మహేశ్ బాబుతో దర్శకుడిగా ఆయన చేస్తున్న సినిమా కోసం 40 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన క్రేజ్ అంతగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ నటించబోయే మరో రెండు సినిమాలకు కూడా మాటలు, స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ విషయమై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.
సాయి ధరమ్ తేజ్, పవన్ కాంబినేషన్లో రాబోయే రీమేక్ కోసం కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా ఈ సినిమా కోసం పారితోషికంగా 20 కోట్ల వరకు అందుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు మరో సొంత కథ కూడా పవన్ కోసం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. దీనికి కూడా 20 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నాడు మాటల మాంత్రికుడు. తన స్నేహితుడి కోసం ఓ మెట్టు దిగి కథకుడిగా మారుతున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి ఓ వైపు దర్శకుడిగానే కాకుండా.. కథకుడిగానూ సంపాదిస్తున్నాడు త్రివిక్రమ్.