ఔరంగాబాద్: గ్వాటాలా ఆట్రామ్ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో 81 ఏండ్ల తర్వాత పెద్ద పులి కనిపించింది. ఈ అభయారణ్యంలో చివరిసారిగా 1940 లో తొలిసారి ఒక పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే, పులి ఈ ప్రాంతానికి చెందినది కాదని అధికారులు నిర్ధారించుకున్నారు.
యావత్మల్ తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 81 ఏండ్లకు పెద్దపులి కనిపించడంతో అటవీ అధికారులు పరిసరాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులను మేతకు సమీపంలోని అడవి వద్దకు తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలని అధికారులు ప్రజలకు సూచించారు.
పూర్తిగా ఎదిగిన మగపులి మార్చి 11-12 తేదీల మధ్య అభయారణ్యానికి వచ్చి ఉండొచ్చని, మార్చి 15 న తాము అమర్చిన కెమెరాకు అది చిక్కిందని డివిజనల్ అటవీ అధికారి విజయ్ సత్పుత్ చెప్పారు. యావత్మల్ తిప్పేశ్వర్ అరణ్యం నుంచి ఆహారం వెతుక్కుంటూ దాదాపు 330 కిలీమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
గ్వాటాలా అభయారణ్యంలో పులులు ఇటీవల కనిపించలేదని, ఇది ముమ్మాటికీ తిప్పేశ్వర్ నుంచి వచ్చిందిగా అధికారులు చెప్తున్నారు. ఈ మగపులిపై నిఘా పెట్టేందుకు ఏడు బృందాలను ఏర్పాటుచేసినట్లు అధికారులు చెప్పారు. ఇటీవల ఒక అడవి పందిని కూడా వేటాడినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
పులి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇంకా నిర్ధారణకు రాలేదని మహారాష్ట్ర రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సభ్యుడు యాదవ్ తార్తే పాటిల్ చెప్పారు. తెలంగాణ మరియు గ్వాటాలాకు సమీపంలోని అడవుల నుంచి వచ్చి ఉండొచ్చని మహారాష్ట్ర అధికారులు భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంధర్కావ్డా, ఉమర్ఖేడ్, తెలంగాణ, అకోలా, జ్ఞ్యాంగాగ (బుల్ధాన), హింగోలి, అజంతా పర్వత శ్రేణుల నుండి గ్వాటాలా చేరుకుని ఉండొచ్చని యదావ్ తార్తే పాటిల్ పేర్కొన్నారు.