కొచ్చి : కరోనాకు వ్యతిరేకంగా రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మరోసారి వ్యాక్సిన్ వేయలేమని కేంద్రం కేరళ హైకోర్టుకు తెలిపింది. కేరళలోని కన్నూరుకు చెందిన ఓ వ్యక్తి కొవాగ్జిన్ రెండో మోతాదులు తీసుకున్నాడు. ఉద్యోగం నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లాల్సి ఉండగా.. ఆ దేశం టీకాను ఆమోదించకపోవడంతో తనకు మరోసారి కొవిషీల్డ్ టీకా వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు.
అయితే, ‘రెండు కంటే ఎక్కువ టీకాలు పొందిన వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక వ్యక్తికి రెండు డోసుల కంటే ఎక్కువ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎలాంటి నిబంధన లేదు. మూడో డోస్ వేసేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అధిక డోస్ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ విషయంలో ఎలాంటి అధ్యయనాలు జరుగలేదు. ఈ కేసులో పిటిషనర్ వాదనను పరిగణలోకి తీసుకోలేం. ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే మరింత మంది కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది’ అని కేంద్రం పేర్కొంది.
గిరికుమార్ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో పని చేస్తుంటాడు. కొవాగ్జిన్ టీకాకు గుర్తింపు లేకపోవడంతో.. వీసా నిబంధనల ప్రకారం ఈ నెల సౌదీ అరేబియా తిరిగి వెళ్లాల్సి ఉందని, లేదంటే తన ఉద్యోగం పోతుందంటూ కోర్టును ఆశ్రయించాడు. గిరికుమార్ జనవరిలో సౌదీ అరేబియాలో సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్కు తిరిగివచ్చాడు. కేంద్రం 45 ఏళ్లకు వ్యక్తులకు టీకాలు వేసిన సమయంలో తన పాస్పోర్టుతో కొవిన్ పోర్టల్ పేరు నమోదు చేసుకొని ఏప్రిల్ 17న కొవాగ్జిన్ మొదటి డోస్, నెల తర్వాత రెండో డోస్ తీసుకున్నాడు. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను సౌదీ అనుమతించకపోవడంతో తన ఉద్యోగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.