మంచిర్యాల, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి, ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం వేళ కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. కోలాటాలతో హోరెత్తించారు. అనంతరం బతుకమ్మలను వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక మన బతుకమ్మ పండుగ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. బెల్లంపల్లి బస్తీ పోచమ్మ చెరువు వద్ద ఏర్పాట్లను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు.
మంచిర్యాల, లక్షెట్టిపేట, దండేపల్లిలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు వేడుకలకు హాజరై తిలకించారు. కోటపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్తో కలిసి హాజరయ్యారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి దంపతులు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు పాల్గొన్నారు.
కౌటాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో మహిళలతో కలిసి ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, ఎంపీడీవో నస్రూల్ల ఖాన్, కౌటాల సర్పంచ్ మౌనిశ్, ఉప సర్పంచ్ తిరుపతి బతుకమ్మ ఆడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి దంపతులు హాజరై తోటి ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, కార్యాలయ, పోలీస్ స్టేషన్ల ఉద్యోగులు పాల్గొన్నారు.