మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన రాయితీలు, ఇతర సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా స్పందన లేదు. మూతపడిన సీసీఐని తెరిపించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. కేంద్రం సర్కారు ఎలాంటి సహాయ, సహకారాలు అందించకపోయినా జిల్లాలో యువతకు ఉపాధి కల్పించడానికి ఐదెకరాల్లో ఐటీ పార్కును త్వరలో ప్రారం భించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిసా్ంత..
-రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.
ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీ లాంటి బడాబాబులకు కట్టబెడుతున్న కేంద్రప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో మాత్రం మొండి వైఖరి అవలంబిస్తున్నది. సీసీఐ తిరిగి ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. పరిశ్రమను పునఃప్రారంభించాలని అఖిలపక్షం ఆందోళనలు చేపట్టినా, స్పందించడం లేదు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా సీసీఐ అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తూ ఉపాధిని మెరుగు పరుస్తున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను భర్తీ చేయగా, ఆదిలాబాద్లో ఐటీ పార్కును ప్రారంభిస్తే, వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశమున్నది.
ఆదిలాబాద్, సెప్టెంబరు 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బడాబాబులకు కట్టబెడుతుండగా, మూతపడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణ రంగం దినదినాభివృద్ధి చెందుతుండగా, సిమెంటుకు డిమాండ్ ఏర్పడింది. పలు ప్రైవేటు సిమెంటు పరిశ్రమలు గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు పొందుతున్నాయి. ఈ తరుణంలో ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రారంభిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. జిల్లాలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మాజీ ఉద్యోగులు, భూ నిర్వాసితులు కేంద్ర ప్రభుత్వం సీసీఐని తిరిగి ప్రారంభించాలంటూ భారీగా ఆందోళనలు నిర్వహించారు. 700 ఎకరాల భూమి, సిమెంటు ఉత్పత్తికి కావాల్సిన ముడిసరుకు ఉన్నాయని పరిశ్రమను ప్రారంభిస్తే జిల్లా అభివృద్ధి చెందడంతో పాటు 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని, అఖిలపక్షం నాయకులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ సోయం బాపురావ్ను కూడా కలిసి కేంద్రం వద్ద ఈ విషయాన్ని ప్రస్తవించాలని కోరారు. కేంద్రం సీసీఐ విషయంలో స్పందంచ లేదు.
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేస్తూ ఉద్యోగులు, నిరుద్యోగుల ఉపాధిని కొల్లగొడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 91,142 ఉద్యోగాలను భర్తీలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3919 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లాల పరిధిలోకి వచ్చే బాసర జోన్లో 2328 ఉద్యోగాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోకి వచ్చే కాళేశ్వరం జోన్లో 1630 ఉద్యోగాలు, నాలుగు జిల్లాల పరిధిలో ఉండే మల్టీజోన్-1లో 6800 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేయనుంది. జిల్లాలోని ప్రైవేటు పరిశ్రమల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంది. ఆదిలాబాద్లోని బీడీఎన్టీ ఐటీ కంపెనీలో 120 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్లో ఐదెకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నదని, ఐటీ పార్కు ఏర్పాటు పై యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం వైఖరితో నిరుద్యోగులకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. తన పరిధిలోని ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ రంగం సంస్థలను బడాబాబులకు కట్టబెడుతూ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నది. మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను కేంద్రం ప్రారంభిస్తే వేలాది మందికి ఉపాధి లభించేది. నిరుద్యోగులు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం, ప్రైవేటు రంగాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చింది. -శివకుమార్, నిరుద్యోగి, ఆదిలాబాద్
ఐటీ పార్కుతో యువతకు ఉపాధి
ఆదిలాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పార్కును ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయం. ఇంజినీరింగ్ చదివిన యువత ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలంటే హైదరాబాద్, బెంగళూర్, పుణె లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రూరల్ టెక్నాలజీ పాలసీతో ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు ఐటీ రంగం విస్తరించింది. ప్రస్తుతం ఆదిలాబాద్లో ఉన్న ఐటీ కంపెనీలో 120 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. ఐటీ పార్కు ఏర్పాటుతో వందలాది మంది యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. -సాయి కిరణ్, నిరుద్యోగి, ఆదిలాబాద్