బాసర, సెప్టెంబర్ 26 : “బాసర ట్రిపుల్ ఐటీలోనే మినీ టీ-హబ్ ఏర్పాటు చేస్తామని, ఇది మీ విద్యా సంస్థనేనని, దీనిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని” రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిలతో కలిసి బాసర ట్రిపుల్ ఐటీని మంత్రి కేటీఆర్ సందర్శించారు. బాసరకు చేరుకున్న మంత్రులకు ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పీ 1, పీ 2 విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
భోజన సదుపాయం ఎలావుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు కోరగా తప్పకుండా అని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంట సేపు సమస్యలను తెలుపడంతో వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మహిళా సిబ్బంది మంత్రి కేటీఆర్కు బతుకమ్మను అందజేశారు. అక్కడి నుంచి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఇంజినీరింగ్ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ప్రతిభ ఉందని, మీరందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉద్యోగాల కోసం పరితపించకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇటీవలే మీరు కూడా ఐటీ హబ్ను సందర్శించారని గుర్తు చేశారు. ఈ విద్యా సంస్థను బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు సిబ్బంది, విద్యార్థులపై కూడా ఉందన్నారు. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి భవన నిర్మాణాలు, ల్యాబ్లకు క్లాస్రూంలు అందించినప్పటికీ, వాటిని బాగా చూసుకునే బాధ్యత విద్యార్థులపైనే ఉంటుందన్నారు.
ఏ సదుపాయం కావాలన్నాసీఎం ఇవ్వాలని చెప్పారు..
నవంబర్ నెలలో మళ్లీ వస్తా. ల్యాప్టాప్లను అందజే స్తా. రూ.3 కోట్లతో మినీ స్టేడియం నిర్మించేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి హామీ ఇస్తున్నామన్నారు. నెలకోసారైనా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శ్రమదానం చేయాలని కోరా రు. అలాగే ఆడిటోరియంలో చైర్లను ఏర్పాటు చేస్తామని, 1000 కంప్యూటర్స్తో డిజిటల్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటన్నింటికీ కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఏ సదుపాయం కావాలన్నా హామీ ఇవ్వాలని పేర్కొన్నారని తెలిపారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి మంచి వీసీని, డైరెక్టర్కు మీకు అందించారని, మీ వైస్ చాన్స్లర్ వెంకటరమణ మంచి విద్యావేత్త అని కొనియాడారు.
అలాగే 50 అదనపు తరగతి గదులను కూడా నిర్మిస్తామని, ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ పేద విద్యార్థులేనని, వీరి కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, రెండేండ్లపాటు కరోనా మహమ్మారి రావడంతో విద్యావ్యవస్థ దారి తప్పిందని, వీటిని ఇప్పుడిప్పుడు దారిలో పెడుతున్నామన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి తాను కచ్చితంగా ట్రిపుల్ ఐటీని సందర్శిస్తానని అన్నారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరు ణ, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫా రూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, ఏఎస్పీ కిరణ్కారే, బాసర స ర్పంచ్ లక్ష్మణ్రావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మంత్రితో విద్యార్థుల సెల్ఫీలు
ట్రిపుల్ ఐటీ మెస్లో భోజన అనంతరం విద్యార్థులు పోటీ పడుతూ మంత్రి కేటీఆర్తో సరదాగా సెల్ఫీలు దిగా రు. సెల్ఫీలను తీసుకున్న విద్యార్థులు ఒక్కొక్కరు తనకు రూ.500 ఇవ్వాలని మంత్రి విద్యార్థులను ఆటపట్టించి నవ్వించారు. దీనికి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. తీసుకున్న సెల్ఫీలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసుకున్నారు.
ఇన్చార్జి వీసీని కొనియాడిన మంత్రి..
బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ వెంకటరమణను మంత్రి కేటీఆర్ కొనియాడారు. వీసీ మంచి విద్యావేత్త అని, ఆయన చదివిన చదువుకు ఈ యూనివర్సిటీ చిన్నదన్నారు. వెంకటరమణ తండ్రి రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. వీసీ దగ్గరుండి పరిష్కరిస్తారని అన్నారు. అందుకే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీ వీసీగా వెంకటరమణను నియమించారని తెలిపా.
మూడున్నర గంటలపాటు కేటీఆర్ పర్యటన..
మధ్యాహ్నం 1.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా బాసరకు రాక.
1.30-1.40 గంటల వరకు మంత్రులకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఇన్చార్జి వీసీ వెంకటరమణ.
1.40-2.00 గంటల వరకు విద్యార్థులతో కలిసి భోజనం.
2.00-2.40 గంటల వరకు మెస్లో పీ 1, పీ 2 విద్యార్థులతో సమస్యలపై ఆరా. కేటీఆర్తో సెల్ఫీలు దిగిన విద్యార్థులు.
2.40-2.45 గంటల వరకు బతుకమ్మ అందజేసిన మహిళా సిబ్బంది.
2.45-4.25 గంటల వరకు ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ భవనంలో భేటీ.
సాయంత్రం 4.50 గంటలకు మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్లతో కలిసి హైదరాబాద్కు పయనం.