స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. తెలంగాణ సర్కారు 22వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండో రోజైన మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శించగా.. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఎస్పీలు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశభక్తిని పెంపొందించేలా తమ ఇండ్లపై పతాకాలు ఎగురవేయాలని సూచించారు. రెండు వారాలపాటు నిర్వహించే వేడుకల్లో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.
ఆదిలాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పక్షం రోజుల వేడుకల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సినిమా థియేటర్లో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అధికారులు విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా తిలకించారు.
నిర్మల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడేలు గాంధీ సినిమా చూశారు. ఆదిలాబాద్లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్థానికులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు జెండాలు పంపిణీ చేయడం జరుగుతోందని, దేశభక్తిని పెంపొందించేలా తమ ఇండ్లపై ఎగురవేయాలని సూచించారు. రెండు వారాలపాటు నిర్వహించే వేడుకల్లో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. రెండు లక్షల జెండాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ షేక్, నటరాజ్, ఆర్టీవో రమేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మున్సిపల్ కమిషనర్ శైలజ, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.