అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామాలు
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
ప్రతి గ్రామంలో డంప్యార్డు, వైకుంఠధామాలు
ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనాలు
చెన్నూర్ రూరల్, మార్చి 28 : చెన్నూర్ మండలం పొక్కూర్ గ్రామ జనాభా 1650. పంచాయతీ పాలక వర్గం పల్లె ప్రగతిని విజయవంతంగా నిర్వహించడంతో అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామ సమీపంలో రూ. 1.60 లక్షలతో స్వాగతం బోర్డు (కమాన్)ను ఏర్పాటు చేశారు. సుమారు రూ. 25 లక్షలతో పలు అభివృద్ధి పనులతో పాటు రోడ్ల నిర్మాణం, రహదారులకు ఇరువైపులా మురుగు కాల్వలను నిర్మించారు. పారిశుధ్యం లోపించకుండా ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. వీధుల్లో చెత్త కుండీలను ఏర్పాటు చేశారు. సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తూ ట్రాక్టర్ ద్వారా డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు కాల్వలను శుభ్రం చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసి ప్రతిరోజూ జీపీ ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయిస్తున్నారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. రూ. 5 లక్షలతో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉచితంగా తాగునీటిని అందిస్తున్నారు. జీపీ సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక టీంగా ఏర్పడి ప్రతి రోజూ గ్రామంలో పారిశుధ్య పనులను చేపడుతున్నారు.
ప్రారంభానికి సిద్ధం..
పొక్కూర్లో రూ. 12 లక్షలతో శ్మశాన వాటిక, రూ. 6 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ. 2.50 లక్షలతో డంప్యార్డు నిర్మించగా, త్వరలో ప్రారంభించనున్నారు. సుమారు రూ. 3 లక్షల జీపీ నిధులతో శ్మశానవాటిక వరకు మట్టి రోడ్డు నిర్మించారు. రూ. 5 లక్షలతో దోభీఘాట్ నిర్మిస్తున్నారు. ఇక్కడ బోరు వేయించారు. నిర్మాణం పూర్తయితే రజకుల సమస్యలు తీరుతాయి. ప్రధాన కూడళ్లతో పాటు ప్రతి కాలనీలో ఎల్ఈడీ లైట్లు అమర్చారు. సర్పంచ్ కుక్కడపు నరేందర్ శ్మశాన వాటిక నిర్మాణానికి రూ. 5 లక్షల విలువ చేసే 10 గుంటల భూమిని విరాళంగా అందించారు.
ఇవి కూడా చదవండి..
ఈయన కూరగాయలు అమ్మే తీరే వేరయా?! వీడియో వైరల్
గ్రేటర్లో ఐదు మోడల్ మార్కెట్లు