కేంద్రం సవరణలపై బీడీ కార్మికుల్లో టెన్షన్
వెనక్కి తీసుకోవాంటూ డిమాండ్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.20 లక్షల మందికి నష్టం
నిరసన బాటకు సిద్ధమవుతున్న కార్మికలోకం
సారంగాపూర్, మార్చి 25 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1.20 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. దేశాయి, శివాజీ, చార్బాయ్, వాణిశక్తి, మారుతి, తాజ్, సదర్ ఇండియా, సరస్సు మొత్తం 10 పరిశ్రమలు, 60 ఫ్యాక్టరీల్లో బీడీ కార్మికులు పని చేస్తున్నారు. నిర్మల్, బోథ్, నేరడిగొండ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా బీడీ కార్మికులు ఉన్నారు. వీరు తయారు చేసిన బీడీలను ఇతర రాష్ర్టాలకు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కార్మికులతో పాటు చాటన్, బట్టికార్మికులు, బీడీ టేకేదార్లు, ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిగరెట్స్ అండ్ అదర్ టొబొకో ప్రొడక్ట్ యాక్ట్ (కోట్పా)కు సవరణలు తీసుకువచ్చింది. దీని ప్రకారం బీడీ కట్టలపై లేబుల్ లేకుండా ప్యాకింగ్ చేయాలి. అలాగే ప్రతినెలా ప్రమాద సూచిక బొమ్మలను మార్చాల్సి ఉంటుంది. బీడీ కంపెనీలు తయారు చేసిన బీడీలను నెలరోజుల్లో అమ్మాలి. ఎవరైనా బీడీలను జేబులో పెట్టుకొని ప్రయాణిస్తే జరిమానా విధిస్తారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ సవరణలను సాకుగా చూపుతూ కంపెనీలు పనిదినాలను తగ్గించాయి. దీంతో కార్మికులకు ఉపాధి తగ్గిపోయింది. ఇతర ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో చాలా కుటుంబాలు అర్ధాకలితో గడుపుతున్నాయి. ఇక 28 శాతం జీఎస్టీ విధిస్తే అమ్మకాలు పడిపోతాయి. తమ ఉపాధిపై దెబ్బపడుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఆందోళన బాట…
కోట్పాకు సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ కార్మికులు ఆందోళన బాటపట్టారు. జిల్లా, మండల కేంద్రాల్లో యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూ పాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లతో సంతకా ల సేకరణ చేపట్టారు. బీడీ కార్మికులతో సంతకా లు చేయించి వాటిని ప్రధానమంత్రితో పాటు కేం ద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పంపుతున్నారు. పొగాకు ఉత్పత్తి చట్టంలోని సెక్షన్-3,6, 7,20(2),24లను సవరించాలని కోరుతున్నారు.