పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కొత్త సినిమా ఆదిపురుష్ (Adi purush) కొత్త విడుదల తేదీని మంగళవారం ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రిలీజ్ చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఆగస్టులో ఈ సినిమా విడుదల కావాలి. కానీ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా (lal singh chaddha) ఏప్రిల్ లో విడుదల కాకపోవడం వల్ల ఆదిపురుష్ ముందే సిద్ధం చేసి పెట్టుకున్న తేదీని వాళ్ల అనుమతితో తీసుకున్నారు. దాంతో ఆదిపురుష్ ఆగస్టులో రాదని తేలింది. అయితే ఎప్పుడొస్తుందనేది అప్పట్లో ప్రకటించలేదు మేకర్స్.
తాజాగా వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు వస్తున్నట్లు వెల్లడించారు. దీంతో సినిమా మరో నాలుగు నెలలు ఆలస్యమైందని అభిమానులు బాధపడుతున్నారు. ఆదిపురుష్ సినిమా ఆలస్యానికి కారణాలు చూస్తే..రామాయణ ఇతిహాస గాథతో తెరకెక్కుతున్న పౌరాణిక సినిమా ఇది. సినిమా షూటింగ్ మొత్తం గతంలోనే పూర్తి చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల దగ్గరే ఆలస్యమవుతోంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల టైమ్ తీసుకుంటోంది.
సినిమాలో 8 వేల వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట. ఇప్పటిదాకా మరే భారతీయ చిత్రంలోనూ ఇంత భారీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించలేదు. వీటి రూపకల్పనలో ఎక్కువ సమయం కావాల్సి వస్తోందట. అలాగే సినిమాను త్రీడీ ఫార్మేట్ లోకి మార్చడం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆలస్యం చేస్తున్నది.
టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నఆదిపురుష్ చిత్రంలో రాఘవ (Raghava)గా ప్రభాస్ నటిస్తుండగా..సీతగా కృతి సనన్ కనిపంచనుంది. లంకేశ్వరుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఒక విజువల్ వండర్ గా ఈ సినిమా నిర్మితమవుతున్నది.