వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన లేఖపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ మమతపై తీవ్రంగా మండిపడ్డారు. మమత ఒక్క స్టాండ్పై నిలబడరని ఎద్దేవా చేశారు. ఉదయం ఓ స్టాండ్, రాత్రి కో స్టాండ్.. ఇలా నిమిష నిమిషానికీ ఆమె తన వైఖరిని మార్చుకుంటుందని మండిపడ్డారు. ఒక్కోసారి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తారని, మరోసారి బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తారని మండిపడ్డారు. మళ్లీ… కాంగ్రెస్ను అంతం చేయాలని మరోసారి పిలుపునిస్తారని, ఇలా ప్రతి సారీ మమత వైఖరి మారుతూ ఉంటుందని అధీర్ తీవ్రంగా మండిపడ్డారు. మమతను నమ్మడం కష్టంగా ఉందని అధీర్ అన్నారు.
ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో పోరాటం చేపట్టేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆదివారం ఆ లేఖను రిలీజ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ సమయంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందన్నారు. అందరికీ అనుకూలమైన ప్రదేశంలో ఈ అంశం గురించి చర్చిచేందుకు రావాలని, దేశంలోని ప్రగతిశీల పార్టీలు ఒక్కటిగా నిలిచి అణిచివేత దళాన్ని అడ్డుకోవాలన్నారు.