న్యూఢిల్లీ, మే 18: గౌతమ్ అదానీ కన్ను ఇక హెల్త్కేర్ రంగంపై పడింది. ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రత్యేక సంస్థను సైతం ఏర్పాటు చేశారు. అదానీ హెల్త్ వెంచర్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ..హెల్త్కేర్కు సంబంధించిన అన్ని విభాగాల్లో సేవలు అందిస్తున్నది. దీంట్లోభాగంగా మెడికల్, డయగ్నిస్టిక్ సేవలు కూడా ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొంది.
ఈ విషయాన్ని స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం అందించింది కూడా. ఇతర రంగాలతో పోలిస్తే హెల్త్కేర్ రంగం గడిచిన ఆరేండ్లుగా 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసుకోవడంతో అదానీ కన్ను ఈ రంగంపై పడింది. ఈ ఏడాది చివరినాటికి దేశీయ వైద్య రంగం 372 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
లక్ష రూపాయల పెయిడ్-అప్ మూలధనంతో అదానీ హెల్త్ వెంచర్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. హెల్త్కేర్, దీని అనుబంధంగా ఉండే సేవలు అందించడానికి ముఖ్యంగా మెడికల్ అడ్మినిస్ట్రేటింగ్, డయగ్నిస్టిక్ సేవలు, హెల్త్ టెక్ ఆధారిత సేవలు, పరిశోధన సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నది. ఈ విషయాన్ని సంస్థ ఎక్సేంజ్లకు సమాచారం అందించింది.
అంబుజా, ఏసీసీ సిమెంట్లలో తనకున్న వాటాను విక్రయించే యోచనలో ఎల్ఐసీ ఉన్నట్లు తెలుస్తున్నది. అంబుజా సిమెంట్, ఏసీసీలో హోల్సిమ్ వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేయడంతో త్వరలో ఒపెన్ ఆఫర్కు రానున్నది. ఈ రెండు సంస్థల్లో ఎల్ఐసీకి రూ.7 వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.
ఈ ఒపెన్ ఆఫర్లో భాగంగా అంబుజా సిమెంట్ షేరు రూ.375గాను, ఏసీసీ షేరు రూ.2,300గా నిర్ణయించింది. అంబుజాలో ఎల్ఐసీ 6.3 శాతం వాటా కలిగివుండగా, అదే ఏసీసీలో 5.7 శాతం వాటా ఉన్నది.