న్యూఢిల్లీ : జనవరి 26న ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఉన్న పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధూకు ఢిల్లీ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల దీప్ సిద్ధూపై బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా అతనికి రూ.30వేల పూచీకత్తు సహా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతులు జనవరి 26న ట్రాక్టర్ పరేడ్ తలపెట్టగా.. ఎర్రకోట వద్ద హింస చెలరేగిన విషయం తెలిసిందే. నాటి హింసలో దాదాపు 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో రైతులను రెచ్చగొట్టి హింసకు కారణమయ్యారనే ఆరోపణలను దీప్ సిద్ధూ ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ఆయనపై వేర్వేరు కేసులు నమోదవగా.. ఫిబ్రవరి 9న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉంటున్న అతడు ఇటీవల బెయిల్కు దరఖాస్తు చేశాడు. ఈ మేరకు కోర్టు విచారణ జరిపింది. గత సోమవారం బెయిల్ దరఖాస్తుపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.
అయితే, జనవరి 26 న చెలరేగిన హింస వెనుక పంజాబీ నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూ లేడని ఆయన తరఫు న్యాయవాది ఈ నెల 8న కోర్టులో బెయిల్పై విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు. ఒక వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, హింస జరిగిన చోట అతను లేడని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు సిద్ధూనే కారణమని, రైతులు ఎర్రకోట వైపు వెళ్లేలా రెచ్చగొట్టాడని పేర్కొన్నారు. అరెస్టుకు ముందే రెండు ఫోన్లను ధ్వంసం చేశాడని, ప్రస్తుతం బెయిల్ ఇస్తే సాక్ష్యాలను నాశనం చేస్తాడని వాదించారు.