హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు పూర్తయిన తర్వాత మళ్లీ తరుగు తీస్తే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వైద్యాధికారులు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, మూడు జిల్లాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులతో హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ నుంచి మంత్రి టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీచేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు పూర్తయ్యాక మిల్లుల వద్ద ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటప్పుడు క్రాస్ చెక్ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు అమలయ్యేలా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కన్నా దాని గురించిన వార్తల ప్రచారం ప్రమాదకరంగా మారిందన్నారు. కరోనా సోకిన వారు ఇంటిలోనే ఉండి చికిత్స పొందవచ్చని.. కరోనా వచ్చిందనగానే భయపడవద్దని సూచించారు.
కరోనా నేపథ్యంలో సామూహికంగా గుమికూడే కార్యక్రమాలు నిర్వహించవద్దని, ఆమేరకు ప్రజలను చైతన్యం చేయాలన్నారు.
కొనుగోలుకేంద్రాల వద్ద కొనుగోళ్ల విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండేలా చూడాలని..వారితో తరచూ టెలీ, వీడియో, జూమ్ సమావేశాలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు, ఇతర ఉన్నత అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు