న్యూఢిల్లీ: ఈసారి ఇండియాలో సాధారణ వర్షపాతమే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు AccuWeather స్పష్టం చేసింది. ఎల్ నినో, లా నినా ప్రభావం లేకపోవడం వల్ల దేశం మొత్తం వర్షాలు బాగానే కురుస్తాయని ఈ వాతావరణ సంస్థ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశ సగటు వర్షపాతం 88 సెంటీమీటర్లు కాగా.. ఇందులో 96 శాతం నుంచి 104 శాతం వరకూ సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి ఇండియాలో ఎక్కడా కరవు జాడలు కనిపించకపోవచ్చని పెన్సిల్వేనియాలోని AccuWeather సీనియర్ వాతావరణ అధికారి జేసన్ నికోల్స్ తెలిపారు. సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏడాదిలో కురిసే మొత్తం వర్షంలో 60 శాతం నుంచి 90 శాతం వర్షాకాలంలోనే కురుస్తుంది.