నల్లగొండ : ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురి చేస్తూ మంగళవారం కత్తితో దాడి చేసిన నిందితున్ని నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
నల్లగొండ పట్టణంలోని అబ్బసియా కాలనీకి చెందిన మీసాల రోహిత్ కుమార్ గత కొన్ని నెలలుగా ఓ యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. సదరు యువతి ఒప్పుకోక పోవడంతో నిన్న మధ్యాహ్నం నల్లగొండ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీసు పార్క్ వద్ద కు రోహిత్ తన స్నేహితుడైన తాయి కుమార్ ద్వారా బాధితురాలుకు ఫోన్ చేయించాడు.
బాధితురాలు తన స్నేహితురాలుతో కలిసి పార్క్ వద్ద వెళ్లింది. అక్కడ కొద్ది సేపు అందరూ కలిసి మాట్లాడిన తరువాత, నిందితుడు పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్పి బాదితు రాలిని పక్కకు తీసుకెళ్లాడు.
ముందస్తు ప్లాన్ ప్రకారం కత్తితో వచ్చిన నిందితుడు రోహిత్ బాధితురాలిని విచక్షణ రహితంగా కడుపు, చేతులు, కాళ్లు, మొహం, పైన పొడిచి గాయపరిచి అక్కడినుండి పారిపోయాడన్నారు.
వెంటనే రంగంలోకి దిగిన నల్గొండ వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారన్నారు. నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్లగొండ డీఎస్పీ నరసింహరెడ్డి, సీఐ గోపి, ఎస్ఐ వెంకట రెడ్డి, సిబ్బంది షకీల్, శ్రీకాంత్ అభినందించారు.