న్యూఢిల్లీ : మహిళను వేధింపులకు గురిచేసి అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన అనంతరం ఆమె కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో వెలుగుచూసింది. నిందితుడు ఏడు నెలల కిందట తన పొరుగింటి మహిళను వేధింపులకు గురిచేసిన అనంతరం బెయిల్పై తిరిగివచ్చి మరోసారి అరాచకం సృష్టించాడు. గత ఏడాది సెప్టెంబర్లో బాధితురాలు కిరాణా షాపుకు వెళుతుండగా అడ్డగించిన నిందితుడు ఆమెను కిందపడేసి దారుణంగా కొట్టాడు. స్టీల్ఛైర్తో ఆమెపై దాడిచేస్తున్నా చుట్టూ చేరిన వారు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఈ ఘటన అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.
అదే ఏడాది నవంబర్లో బెయిల్పై విడుదలైన నిందితుడు శనివారం మహిళ ఇంట్లోకి చొరబడి ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేశాడు. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేదు. బెయిల్పై విడుదలైనప్పటి నుంచి నిందితుడు నిత్యం తమను దూషించేవాడని మహిళ కుమారుడు ఆరోపించారు. తన తల్లిని కొట్టిన నిందితులు ఇప్పుడు ఇతర కుటుంబ సభ్యులను గాయపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధిత మహిళ కుమారుడు వాపోయారు. నిందితుడు శనివారం తన భార్య, సోదరుడితో కలిసి ఇనుపరాడ్లు, రాళ్లు పట్టుకుని తమ ఇంట్లోకి వచ్చాడని, తన సోదరి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడని ఆరోపించారు. పోలీసులకు ఫోన్ చేస్తామని చెప్పగా వారు తమను కొట్టడం ప్రారంభించారని స్ధానికులు జోక్యం చేసుకోవడంతో తాము బయటపడ్డామని చెప్పారు. తమకు ఈ ఘటనపై సమాచారం అందిందని నిందితుడిపై తాజాగా కేసు నమోదు చేశామని నిందితుడి బెయిల్ రద్దు చేసేందుకు ఇది ఉపకరిస్తుందని ఘజియాబాద్ సీఐ అవనీష్ కుమార్ తెలిపారు.