చెన్నూరు, మే 5 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని 90 వేల పైచిలుకు ఎకరాలకు సాగు నీరు అందించే భారీ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్,చెన్నూరు బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు భారీ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి హైదరాబాద్లోని జలసౌధలో ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావుతో గురువారం ఆయన చర్చించారు.
ఇప్పటికే ప్రభుత్వం సర్వేకు సంబంధించిన నిధులు మంజూరు చేయడంతో అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలిపి రూ 1,659 కోట్లను ఇటీవల మంజూరు చేసింది. దీంతో ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వివరాలపై ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును విప్ కలిశారు.
టెండర్ పనుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరారు. మురళీధర్ రావు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. గోదావరి నదిపై రెండు, ప్రాణహిత నదిపై ఒకటి మెత్తం మూడు ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు.