Abroad Education | గతంతో పోలిస్తే విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు మెరుగు పడ్డాయి. సైన్స్ అండ్ టెక్నాలజీతోపాటు మెడిసిన్, ఎంబీఏ, న్యాయ విద్య.. విదేశాల్లో దాదాపు అన్ని రంగాల్లో ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించడానికి భారత్ విద్యార్థులు ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్ యూనియన్ దేశాల్లో ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించడంతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న మెరుగైన విద్యా విధానం.. ఆ వెంటనే కొలువు దొరకడం, అటుపై కెరీర్ వృద్ధి.. జీవితంలో స్థిర పడటానికి మార్గం సులువవుతున్నది. అందుకే ఇండియన్ విద్యార్థులు విదేశీ విద్యాభ్యాసానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం 13 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లోని యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతం అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం కావడంతో విద్యా కోర్సు ఫీజుతోపాటు ఆయా దేశాల్లో జీవనానికి ఖర్చు తడిచి మోపెడవుతుంది. ఫీజులు, ఖర్చులు ఎలా ఉంటాయి.. విదేశీ విద్యనభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏ వ్యూహం అనుసరించాలో తెలుసుకుందామా..
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం అంటే ఖర్చుతో కూడుకున్న పని.. మనదేశంలో రూ. వేలు, రూ.లక్షల్లో ఫీజు చెల్లించాలి. విదేశాల్లో విద్యాభ్యాసం అంటే.. డాలర్లలోనే పే చేయాల్సి ఉంటది. ఫీజులతోపాటు విదేశాల్లో వసతి, భోజనం తదితర అవసరాలు కూడా డాలర్తోనే తీర్చుకోవాలి. కరోనా, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, ముడి చమురు ధర తదితర పరిస్థితుల్లో డాలర్పై రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతున్నది. అదే జరిగితే డాలర్ విలువ పెరుగుతుంది. ఉదాహరణకు ఐదేండ్ల క్రితం డాలర్ రూ.64 పలికితే.. ఇప్పుడు రూ.81 పై చిలుకు చెల్లిస్తేనే ఒక డాలర్ లభిస్తుంది.
ఇక భూతల స్వర్గంగా భావించే అమెరికాలో యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు, జీవనానికి అయ్యే ఖర్చులే విదేశీ విద్యాభ్యాసం బడ్జెట్లో ఎక్కువ భాగం ఉంటాయి. విదేశీ విద్యాభ్యాసం కోసం బ్యాంకుల్లో విద్యా రుణాలు తీసుకుని వెళ్లాల్సి ఉంటది. అయితే, డాలర్ విలువ పెరగడం వల్ల కోర్సు పూర్తయి ఉద్యోగం చేస్తున్న వారికి లబ్ధి చేకూరుతుంది. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా విద్యారుణం చెల్లించడానికి వెసులుబాటు కలుగుతుంది.
సరిగ్గా 11, 12 ఏండ్ల క్రితం నాలుగేండ్ల డిగ్రీ కోర్స్ ఫీజు 32 వేల డాలర్లు (రూపాయల్లో రూ.14.40 లక్షలు).. ఇప్పుడు 43 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.34.83 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. డాలర్పై రూపాయి విలువ పతనం వల్ల ప్రతి ఏటా అమెరికాలో విద్యా ఖర్చులు సుమారు 10 శాతం పెరుగుతాయి. ధరల పెరుగుదల వల్ల నిరుడు చెల్లించిన రూ. లక్ష ఫీజుకు ఈ ఏడాది అదనంగా రూ.6,575 పే చేయాల్సి ఉంటది. దీనికితోడు అమెరికాలో ద్రవ్యోల్బణం 8.6 శాతం నమోదు కావడంతో పరిస్థితి మరింత దెబ్బ తిన్నది.దీనివల్ల అమెరికాలో విద్యాభ్యాసానికి వెళ్లే భారతీయ విద్యార్థులు తమ రోజువారీ ఖర్చులకు అదనంగా డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కనుక బ్యాంకుల్లో రుణం ద్వారా విద్యాభ్యాసం చేసే విద్యార్థులు భవిష్యత్లో వడ్డీరేట్లు పెరుగుతాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏ నిర్ణయమైనా ఆలస్యంగా అమలు చేయొచ్చునేమో గానీ, విద్యా సంబంధ అంశాలపై ఎటువంటి తాత్సారం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని విద్యావేత్తలు చెబుతున్నారు. విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లిన విద్యార్థులు స్కాలర్షిప్, అసిస్టెంట్, పార్ట్టైం, క్యాంపస్ కొలువులతో వచ్చే ఆదాయం వల్ల కొన్ని ఖర్చులు భరించొచ్చునని అంటున్నారు. ఇటువంటి ఆల్టర్నేటివ్ ఫండింగ్ చాన్స్లతో విద్యార్థులకు కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుందో అర్థం అవుతుందంటున్నారు. విద్యాభ్యాసం అయ్యాక విద్యార్థులు కొలువులు సంపాదించుకునేందుకు మెరుగ్గా సిద్ధమవుతారని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు.
ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం ఎంత పతనమైనా ఉన్నత విద్యాకోర్సుల అభ్యసించడానికి విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు తమ నిర్ణయాన్ని మార్చుకోరని కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి. విదేశీ విద్యపై ఏండ్ల తరబడి ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నాయి. కనుక ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లాలన్న నిర్ణయంపై అంత తేలిగ్గా వెనకడుగు వేయరని స్పష్టం చేస్తున్నారు.
విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే ప్రతి విద్యార్థి.. డాలర్ కొనుగోలుకు ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాలని ఆందోళన గురి కావడం సహజమేనని విద్యావేత్తలు అంటున్నారు. కానీ కోర్సులు పూర్తయిన తర్వాత విదేశాల్లో ఉద్యోగంతో డాలర్లలోనే సంపాదిస్తారు. ఆ డాలర్లను భారత్కు పంపితే మన కరెన్సీలోనే ఎక్కువ ఉంటాయని మరిచిపోవద్దని చెబుతున్నారు. కనుక విదేశీ విద్యాకోర్సులు అభ్యసించడానికి చేసిన భారీ ఖర్చు.. తర్వాత ఉద్యోగంలో చేరితే వచ్చే ఆదాయంతో సరిపోతుంది.
విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లాలని కోరుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు పదేండ్ల ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 10 ఏండ్ల సుదీర్ఘ టైం గల మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద పెట్టుబడి పెట్టాలి. స్వల్పకాలికంగా మ్యూచువల్ ఫండ్స్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా పదేండ్లలో మంచి రిటర్న్సే వస్తాయి. ఇంకా పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసినా మంచి రిటర్న్స్ పొందొచ్చు. విద్యార్థినుల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి పథకంలో ఇన్వెస్ట్ చేస్తే ఆ చిన్నారులు విదేశీ విద్యాభ్యాసం చేయాలన్న కల నెరవేర్చుకోవడం ఈజీగా ఉంటుంది.