125వ జయంత్యుత్సవం
ఆయన ఒక చైతన్యం. ఆధ్యాత్మిక తరంగం. భాగవత గాథలు తెలిపినా.. భగవద్గీతను యథాతథంగా విశ్లేషించినా.. దుఃఖసాగరంలో మునిగిన సామాన్యులను ఉద్ధరించడానికే! అందుకోసం సాగరాలు దాటారు. నగరాలు తిరిగారు. నరుల వద్దకు నారాయణుడి ప్రతినిధిగా తరలి వెళ్లారు. కృష్ణ తత్వాన్ని ఖండాలు దాటించి.. కోట్లాదిమందిని గోవిందుడికి చేరువ చేశారు.. శ్రీల ప్రభుపాదుల వారు. ఆ మహనీయుడి 125వ జయంత్యుత్సవం సందర్భంగా ..
కృష్ణ చైతన్యాన్ని ఆధునిక శాస్త్రీయ దృక్పథంలోనూ పురోగమింపజేయడానికి ‘భక్తివేదాంత ఇన్స్టిట్యూట్’ను స్థాపించి, సైన్స్ విద్యార్థులకు ఆధ్యాత్మికతను మరింత చేరువ చేశారు.
సామాన్య జీవన శైలి, అత్యున్నత తత్వచింతన అనే సూత్రాన్ని బోధిస్తూ.. వ్యవసాయ క్షేత్ర సమాజాలను స్థాపించారు. ప్రకృతి, భగవంతునిపై ఆధారపడే జీవన విధానాన్ని నిర్దేశించారు.
కృష్ణచైతన్యంపై 70కి పైగా గ్రంథాలు రచించారు.
1968-77 వరకు మొత్తం 22 వేల పేజీల భాష్యాలను ప్రచురణకు వీలుగా శబ్ద యంత్రాల్లో నిక్షిప్తం చేశారు.
ప్రజలకు కృష్ణ చైతన్యాన్ని బోధించేందుకు గురుకులాలు, ఆశ్రమాలు మొదలైన వాటిని ఎన్నో స్థాపించారు.
భక్తి మార్గంలోని సూత్రాలను బోధించేందుకు వేద పాఠశాలలను కూడా స్థాపించారు.
1965, బృందావనం 70 ఏండ్ల ఒక సన్న్యాసి అంతర్మథనం. కర్మభూమి విశిష్ఠతను, భారతావని ఆధ్యాత్మిక శక్తిని, శ్రీకృష్ణ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించారు. భగవద్గీత బోధనలు, శ్రీకృష్ణ నామామృతాన్ని పాశ్చాత్యులకు అడక్కుండానే వరంగా ప్రసాదించాలని భావించారు. వారి గురుదేవుల ఆదేశానుసారం ఈ బృహత్కార్యాన్ని నిర్వర్తించడానికి సాగరయానానికి పూనుకున్నారు.
జలధి తరంగాలపై తేలియాడుతున్నది జలదూత. ఆ వాణిజ్య నౌకలో విదేశీయానానికి సిద్ధమయ్యారు శ్రీకృష్ణ దూత. అలుపెరుగని ఆధ్యాత్మిక మూర్తికీ కడలి ప్రయాణంలో బడలిక తప్పలేదు. రెండుసార్లు గుండెపోటు చేటు చేయబోయింది. శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం గుండె కవాటాలకు కవచమైంది. ఆత్మవిశ్వాసంతో స్వస్థత పొందారు. తన గురువుగారి కరుణాతరంగాలను విశ్వవ్యాప్తం చేయడానికి అమెరికాలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నది కేవలం నలభై రూపాయలు, తరగని సంపదగా ఐదు పెట్టెల్లో శ్రీమద్భాగవత గ్రంథాలు. ఆ గ్రంథాలనే నమ్ముకున్నారు. అందులోని సారాన్నంతా రంగరించి తన అనుగ్రహ భాషణంతో అక్కడి వారికి భూషణంగా అందివ్వాలని అనుకున్నారు.
దేశంకాని దేశం, పరిచయస్థులు ఎవరూ లేరు. మాధవుణ్ని మాత్రమే నమ్ముకున్నారా సాధువు. పదకొండేండ్ల తర్వాత ఆయన ఓ ఆధ్యాత్మిక విప్లవం. ప్రపంచవ్యాప్తమైన హరేకృష్ణ ఉద్యమానికి స్థాపకాచార్యులు. ప్రపంచాన్ని పద్నాలుగుసార్లు చుట్టి వచ్చి.. ఈ జగమంతా శ్రీకృష్ణుని చుట్టూ తిరిగేలా చేసిన మహారుషి. ఆ మహనీయులే కృష్ణ కృపామూర్తులైన పరమపూజ్య శ్రీ శ్రీమత్ ఎ.సి.భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. ప్రియశిష్యులంతా ఆత్మీయంగా శ్రీల ప్రభుపాద అని సంబోధిస్తారు. హరేకృష్ణ నామాన్ని జనస్రవంతిలో మమేకమయ్యేలా చేసిన తపోనిధి. వారి 125వ జయంతి వత్సరం ఇది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ప్రభు
పాదుల వారి పేరిట 125 రూపాయల బిళ్లను విడుదల చేసింది.
బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణుని భవిష్యవాణిని పరిపూర్ణం గావిస్తూ, పవిత్రమైన కృష్ణ నామాలను ప్రచారం చేసేందుకు శ్రీల ప్రభుపాదులవారు ఈ లోకాన ఆవిర్భవించారన్నది శాస్ర్తాధారితమైన సత్యం.
భాగీరథి ఉవాచహే నాథ రమణ- శ్రేష్ఠ యసి గోలోకముత్తమమ్, అస్మాకమ్ కా గతిశ్చత్ర భవిష్యతి కలౌ యుగే
‘ఓ దేవదేవా! ఓ జగన్నాథా! మీరిప్పుడు గోలోక బృందావనానికి తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ కలియుగాన ఇక మా గతేమిటి?’ అని గంగ విన్నవించుకుంది.
శ్రీ భగవాన్ ఉవాచ మన్-మంత్రోపాసక-స్పర్శద్ భస్మి-భూతాని తత్-క్షణాత్ భవిష్యన్తి దర్శనశ్చ స్నానాదేవహి జాహ్నవీ‘ఓ గంగా! నన్ను నా మంత్రంతో అనేకమంది భక్తులు ఆరాధిస్తారు. వారి స్పర్శ, దర్శనం, స్నాన మాత్రంతో సమస్త పాపాలన్నీ భస్మీపటలం అవుతాయ’ని ఆ పరంధాముడు పలికాడు. ఈ సంవాదంలో తన నామాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయగల అత్యంత శక్తిమంతుడైన, మంత్రోపాసకుడైన తన భక్తుని ఆగమనాన్ని శ్రీకృష్ణుడు తెలిపాడు. (బ్రహ్మవైవర్త పురాణం, కృష్ణ జన్మకాండ, అధ్యాయం 129, 49-51). ఆ భవిష్యవాణిని పరిపూర్ణం చేస్తూ ప్రభుపాదుల వారు హరే కృష్ణ మహా మంత్రాన్ని నలుమూలలా విస్తరింపజేశారు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
శ్రీల ప్రభుపాదుల వారు తమ భౌమ జీవిత కాలంలో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని కోసం అనేకానేక సేవలను గావించారు. వారు స్థాపించిన ఉద్యమం ద్వారా ఆ లీలలు నేటికీ లక్షలాది జీవితాలను పవిత్రం చేస్తున్నాయి. భక్తి మార్గాన్ని బోధించడంలో శ్రీల ప్రభుపాదుల వారు సాధించిన అపురూపమైన విజయాలలో కొన్ని..
సుప్రసిద్ధ మధ్యాహ్న భోజన పథకం అయిన‘అక్షయ పాత్ర’కు స్ఫూర్తిప్రదాత శ్రీల ప్రభుపాదుల వారే. ‘10 మైళ్ల పరిసరాల్లో ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా మనం చూడాలి. దేవాలయమంటే భగవంతుని ఇల్లు. భగవంతుడు అందరికీ తండ్రి, అంటే.. శ్రీకృష్ణుడు అందరికీ తండ్రి. ఆ తండ్రి సమక్షంలో పిల్లాడు ఆకలితో అలమటించరాదు. కాబట్టి, ప్రజలకు ఆహారాన్ని అందించే వ్యవస్థను మనం తప్పకుండా ఏర్పాటుచేయాలి’ అనేవారు శ్రీల ప్రభుపాదులు.
‘మన ఉద్యమం మానవ జాతికే ఒక గొప్ప వరం. దీన్ని వారు ఇప్పుడే గుర్తించలేక పోవచ్చు, కానీ, ఈ ఉద్యమం మానవ జాతిని అనాగరికతలో పతనమైపోకుండా రక్షించిందని చరిత్రే ఆధారాలతో నిరూపించే సమయం తప్పక వస్తుంది’ అని 1969లో రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. ప్రభుపాదుల వారిని ఆశ్రయించి హరేకృష్ణ మహామంత్రాన్ని జపించినవారు జీవితంలో పరిపూర్ణతను సాధిస్తారు. మీరూ జపించండి, ఆనందంగా జీవించండి. https://harekrishnajapayagna.com/register/లో మీ పేరును నమోదు చేసుకోండి.
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984