బస్స్టాండ్లో ఉన్న గర్భిణి.. ప్రత్యేక వాహనంలో ఇంటికి పంపించిన పోలీసులు
హయత్నగర్, జూన్ 2 : వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణికి హయత్నగర్ పోలీసులు సహాయం అందించి.. ప్రత్యేక వాహనంలో ఆమెను ఇంటికి సురక్షితంగా పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి-భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, కోయిల్గూడెంకు చెందిన మంజుల గర్భిణి. బుధవారం ఉదయం ఆమె నగరానికి వచ్చి ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయించుకుంది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు హయత్నగర్ ఆర్టీసీ బస్టాండ్కు చేరుకోగా.. అప్పటికే లాక్డౌన్ సమయం ముగియడంతో బస్సులులేక అక్కడే ఉన్నది.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న డీఐ నాగార్జున, ఎస్ఐ నస్రీన్ బేగం గమనించి బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకుని.. ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి ఆమెను ఇంటికి పంపించారు. దీంతో ఆమె పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.