భువనేశ్వర్: హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్, ‘అభ్యాస్’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి దీనిని ప్రయోగించి పరీక్షించింది. ట్రయల్ రన్ సమయంలో పలు సాంకేతిక అంశాలను పరిశీలించింది. గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ నుండి సబ్సోనిక్ వేగంతో ఎగిరిన అభ్యాస్ ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఛేదించింది. 2019 మేలో తొలిసారి దీనిని విజయవంతంగా పరీక్షించారు. వాయు టార్గెట్లకు వినియోగించే వివిధ క్షిపణి వ్యవస్థల మూల్యాంకనం కోసం గ్రౌండ్-బేస్డ్ కంట్రోలర్ వాహనాన్ని వినియోగిస్తారు.
భారత సాయుధ దళాల కోసం ‘అభ్యాస్’ను డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) 2012 నుంచి అభివృద్ధి చేస్తున్నది. ఉపరితలం నుండి గాల్లోకి, ఎయిర్-టు-ఎయిర్ ఇంటర్సెప్షన్ క్షిపణులను పరీక్షించే విమానాలను ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. టార్గెట్ రాడార్ రిఫ్లెక్టివిటీ, ఎకౌస్టిక్ మిస్ డిస్టెన్స్ ఇండికేటర్ (AMDI) వ్యవస్థను మెరుగుపరచడానికి ముక్కు కోన్లో లూన్బర్గ్ లెన్స్తో సర్దుబాటు చేయగల రాడార్ క్రాస్-సెక్షన్ను ఇది కలిగి ఉంటుంది.
పూర్తిగా స్వయంప్రతిపత్తిగా ఎగిరే అభ్యాస్, గ్యాస్ టర్బైన్ ఇంజిన్ ఆధారంగా పని చేస్తుంది. నావిగేషన్ కోసం మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్లను ఉపయోగించారు. ఫ్లైట్ మార్గదర్శకత్వం, నియంత్రణను కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తారు.