జొహన్నెస్బర్గ్: ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2018లోనే అంతర్జాతీయ క్రికెట్కు టాటా చెప్పిన ఏబీ.. ఇక ముందు ఐపీఎల్లో కూడా ఆడబోనని స్పష్టం చేశాడు. ఐపీఎల్లో 11 సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన 37 ఏండ్ల ఏబీ.. శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రత్యర్థి ఎవరైనా.. పరిస్థితులు ఎలాంటివైనా.. తన విధ్వంసక బ్యాటింగ్ విన్యాసాలతో ‘మిస్టర్ 360’గా గుర్తింపు పొందిన డివిలియర్స్.. ఆర్సీబీ తరఫున 156 మ్యాచ్లు ఆడాడు. ‘ఇన్నేండ్లు క్రికెటర్గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణం. ఇక అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసింది. చిన్నప్పుడు సోదరులతో కలిసి ఆట ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ క్షణం క్రికెట్ను ఆస్వాదించా. ఇప్పుడు 37 ఏండ్ల వయసులో అలాంటి కసి లోపించినట్లు అనిపిస్తున్నది. ఈ ఆట నాకెంతో ఇచ్చింది. ఆప్త మిత్రుడు విరాట్ కోహ్లీ, సహచరులు, కోచ్లు, సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు కృతజ్ఞతలు. ఇక పై జీవితంలో మరో అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటా’ అని డివిలియర్స్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.