ముంబై: దిగ్గజ క్రికెటర్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది. తమ జట్టుకు విశేష సేవలందించిన ఈ ఇద్దరితోనే జాబితాను ప్రారంభిస్తున్నట్లు ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ‘డివిలియర్స్, గేల్ చాలా ఏండ్ల పాటు జట్టుకు విశేష సేవలందించారు. విధ్వంసక ఆటతీరుతో ఐపీఎల్ రూపురేఖలు మార్చిన ఘనత వారి సొంతం. ఈ ఇద్దరు ఆటగాళ్లు నాకు ఎంతో ప్రత్యేకం.
లీగ్పై వీరి ప్రభావం ఎప్పటికీ ఉంటుంది’అని కోహ్లీ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న డివిలియర్స్, గేల్.. తమకు హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మిస్టర్ 360 డిగ్రీస్గా పేరున్న డివిలియర్స్ ఐపీఎల్లో 2011 నుంచి 2021 వరకు బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. 157 మ్యాచ్ల్లో 158.33 స్ట్రయిక్ రేట్తో 4,522 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 37 అర్ధశతకాలు ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ముద్దుగా యూనివర్సల్ బాస్ అని పిలుచుకునే క్రిస్ గేల్ ఆర్సీబీ తరఫున 2011 నుంచి 2017 వరకు 91 మ్యాచ్లు ఆడి.. 154.40 స్ట్రయిక్ రేట్తో 3,420 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్ సందర్భంగా బెంగళూరులో గేల్, డివిలియర్స్ను సన్మానించనున్నట్లు ఆర్సీబీ తెలిపింది.