ధరల పెరుగుదలపై ఆప్ ఆందోళన
కేంద్ర మంత్రిని అడ్డుకొన్న కార్యకర్తలు
అబిడ్స్/సుల్తాన్బజార్, మే 30: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అడుగడుగునా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సెగ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికీ తగిలింది. పెట్రోల్, డీజిల్ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు, కార్యకర్తలు నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో కలెక్టరేట్లో ఓ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తున్న కిషన్రెడ్డి కాన్వాయ్ని ఆప్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకొన్నారు.
‘నరేంద్రమోదీ.. డౌన్ డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారితో బీజీపీ కార్పొరేటర్లు, నాయకులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను అక్కడి నుండి తరలించారు. అనంతరం ఆప్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే తగ్గించకుంటే మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.