న్యూఢిల్లీ : అణగారిన వర్గాల కోసం అందించే విద్య, వైద్యం వంటి సామాజికార్ధిక పధకాలను ఉచితాలుగా పరిగణించలేమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. ఈ అంశంలో పెండింగ్ పిటిషన్లో జోక్యం చేసుకోవాలని ఆప్ సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరింది. ఎన్నికల్లో ఉచిత హామీలను గుప్పించే రాజకీయ పార్టీలపై చర్యలు చేపట్టాలని కోరుతూ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అర్హులైన అణగారిన వర్గాల ప్రజలకు వర్తింపచేసే పధకాలను తాయిలాలుగా పరిగణించలేమని ఆప్ పేర్కొంది.
కనీస సౌకర్యాలు ప్రతిఒక్కరికీ అందేలా సామ్యవాద, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అనుసరించాలని రాజ్యాంగం నిర్ధేశిస్తోందని తెలిపింది. భారత్ వంటి అసమానతలు నిండిన సమాజంలో బలహీన వర్గాల జీవితాలను మార్చే కార్యక్రమాలు, పధకాలు అత్యవసరమని ఆప్ పిటిషన్ స్పష్టం చేసింది. ఉచితాల అమలు దేశ ఆర్ధిక వ్యవస్ధపై చూపే ప్రభావంపై చర్చించేందుకు ముందు రాజకీయనాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏమేం ఇస్తున్నామనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. రాజ్యాంగం నిర్ధేశించిన విధంగా గౌరవప్రదమైన జీవితం పొందాల్సిన ప్రజల స్ధానంలో రాజకీయ, పాలక వర్గాలే ప్రభుత్వం నుంచి అత్యధికంగా లబ్ధి పొందుతున్నారని గుర్తుచేసింది.
రాష్ట్ర రాజధానుల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ అధికారులు ఉచితంగా ఇండ్లు పొందుతున్నారని తెలిపింది. కాగా ఉచితాలను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సిఫార్సులు చేయాలని సుప్రీంకోర్టు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును ఈనెల 11న సుప్రీంకోర్టు విచారించనుంది. మరోవైపు పార్టీలు ఓట్లు దండుకునేందుకు ఉచితాల పేరుతో తాయిలాల సంస్కృతిని ప్రవేశపెడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆరోపించగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ఉచితాల కిందకు రావని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీటుగా బదులిచ్చారు.