న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడుల నేపధ్యంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఢిల్లీలో కేజ్రీవాల్ చేపట్టి, అందరి ప్రశంసలు అందుకుంటున్న విద్యా, వైద్య మోడల్స్ను దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆప్ నేత, ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. ఢిల్లీలో విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసేందుకు ఈ రెండు రంగాలపై కేంద్రం దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కుట్రలో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను జైలు పాలు చేసి తాజాగా మనీష్ సిసోడియాను ఇరికించే కుట్రకు తెరలేపారని మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ మోడల్ను ధ్వంసం చేసేందుకే తమ విద్యా, వైద్య శాఖ మంత్రులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ పాలసీలు విజయవంతమై ఆయన ప్రతిష్ట పెరుగుతుండటంతో బెంబేలెత్తిన బీజేపీ కుయుక్తులకు పాల్పడుతోందని అన్నారు.
తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై సీబీఐ వంటి దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ను అంతమొందించే ఏకైక లక్ష్యంతో కమలనాధులు పనిచేస్తున్నారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. ఢిల్లీ పాఠశాలల గురించి న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించిన వ్యాసాన్ని పెయిడ్ న్యూస్గా బీజేపీ అభివర్ణించడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.