న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అవకతవకలు, అక్రమ నియామకాలకు సంబంధించిన కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు బెయిల్ లభించింది. రోజ్ అవెన్యూ కోర్టు ఆయనకు పలు షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల కిందట ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమ నియామకాలపై ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తు జరుపుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఢిల్లీలోని అధికార ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆయన వ్యాపార భాగస్వామి హమీద్ అలీ ఖాన్ మసూద్ ఉస్మాన్ నివాసాల్లో ఢిల్లీ పోలీసులు రైడ్ చేశారు. రూ.12 లక్షల డబ్బు, డబ్బులు లెక్కించే యంత్రం, అక్రమంగా కలిగి ఉన్న ఒక పిస్టల్, నాలుగు బులెట్లను ఎమ్మెల్యే అనుచరుడు హమీద్ అలీ ఖాన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఓఖ్లా ఎమ్మెల్యే అయిన అమానతుల్లా ఖాన్, ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్గా ఉన్నారు. ఏసీబీ సమన్లు జారీ చేసిన విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. కొత్త వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని నిర్మించినందున తనకు సమన్లు అందాయని అందులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఏసీబీ కార్యాలయానికి హాజరైన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఏసీబీ అధికారులు పలు గంటలపాటు ప్రశ్నించారు. 2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన 32 అక్రమ నియామకాలపై ఆరా తీశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
మరోవైపు ఏసీబీ కస్టడీ అనంతరం అమానతుల్లా ఖాన్కు కోర్టు సోమవారం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపింది. అయితే అమానతుల్లా ఖాన్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన తరుఫు సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా వాదించారు. నిధులు, నియామకాల్లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరుగలేదన్నది ప్రాథమిక ఆధారాల ద్వారా తెలుస్తున్నదని అన్నారు.
కాగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ ఏసీబీ తరుఫున వాదించారు. అమానతుల్లా ఖాన్కు బెయిల్ మంజూరుకు తగిన సమయం కాదని కోర్టుకు తెలిపారు. తన మొబైల్ ఫోన్ పోయిందంటూ ఏసీబీకి ఆయన అబద్ధాలు చెప్పారని అన్నారు. ఈ నేపథ్యంలో వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.