ఖమ్మం : చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. కల్లూరు మండలం గోవరం పంచాయతీ పరిధిలోని కనుగుల చెరువులో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మేజర్ పంచాయతీ పరిధిలోని ఖాన్ఖాన్పేటకు చెందిన చట్టుబోయిన మహేష్ (25) గోకవరం పంచాయతీలోని కనుగుల చెరువు వద్దకు తన మిత్రులతో కలిసి చేపల పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు వల వేసేందుకు చెరువులోకి దిగడంతో ఊబిలో కూరుకుపోయాడు.
పక్కనే ఉన్న తోటి మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఊబిలో కూరుకుపోయి మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకుని మహేష్ మృతదేహాన్ని వెలికితీయించారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్సై శ్వేత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.