హైదరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)/గోల్నాక: కళాశాల యాజమాన్యం టీసీ ఇవ్వకుండా వేధిస్తున్నదన్న ఆవేశంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం హైదరాబాద్లోని అంబర్పేటలో శుక్రవారం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆ యువకుడితోపాటు అతని మిత్రుడు, కళాశాల ప్రిన్సిపాల్, ఏవో కూడా గాయపడ్డారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అంబర్పేటలోని నారాయణ జూనియర్ కాలేజీలో రామంతపూర్ వెంకట్రెడ్డినగర్కు చెందిన సాయి నారాయణ అనే విద్యార్థి గత విద్యాసంవత్సం ఇంటర్ పూర్తి చేశాడు. అయితే అతడు కాలేజీకి రూ.16 వేల ఫీజు చెల్లించాల్సి ఉన్నది.
రెండు రోజుల క్రితం టీసీ కోసం కాలేజీకి వెళ్లగా బకాయిపడ్డ ఫీజు చెల్లించనిదే టీసీ ఇవ్వడం కుదరదని కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్ స్పష్టంచేశారు. దీంతో సాయినారాయణ తన స్నేహితుడైన విద్యార్థి సంఘం నాయకుడు సందీప్తో పాటు మరో ఎనిమిది మంది విద్యార్థుల వెంట బెట్టకొని శుక్రవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగారు. కోపోద్రికుడైన సందీప్ తనతో తెచ్చుకున్న పెట్రోల్తో ఆత్మహత్య చేసుకొంటానని పెట్రోల్ చల్లుకొని బెదిరించడానికి ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు అక్కడే దేవుడి పటం వద్ద వెలిగించిన దీపం తాకి సందీప్కు మంటలు అంటుకొన్నాయి.
అదే సమయంలో అతడు అక్కడే ఉన్న కాలేజీ ఏవో ఆశోక్రెడ్డి, ప్రిన్స్పాల్ సుధాకర్ను పట్టుకోవటంతో వారికి కూడా మంటలంటుకొన్నాయి. పక్కనే ఉన్న మరో విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసి, నలుగురిని గాంధీ దవాఖానకు తరలించి, మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి డీఆర్డీవో అపోలో దవాఖానకు తరలించారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వోడెన్న కాలేజీకి వెళ్లి విచారణ జరిపారు. వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించారు. కాలేజీకి చెందిన హార్డ్డిస్క్, (సీసీ కెమెరాల ఫుటేజ్) పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
నారాయణ కాలేజీ సంఘటనకు బాధ్యులెవరైనా చట్టపరంగా శిక్షిస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
టీసీ, మెమోలు వంటి సర్టిఫికెట్లను విద్యార్థులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే సీరియస్గా పరిగణిస్తామని ఇంటర్బోర్డు ఉమర్ జలీల్ హెచ్చరించారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై విద్యార్థులు వ్యక్తిగతంగా డీఐఈవోకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏ కారణంగానూ యాజమాన్యాలు సర్టిఫికెట్లను జారీచేయకుండా నిలుపుదల చేయరాదని, విద్యార్థులకు సర్టిఫికెట్లను జారీచేయడం ప్రిన్సిపాళ్ల బాధ్యతని స్పష్టంచేశారు.