పాలకుర్తి రూరల్ అక్టోబర్ 15: సొంత అన్నదమ్ముల భూమిని కూడా దక్కించుకునేందుకు కుట్రలు పన్నుతున్న ఈ రోజుల్లో.. పొరపాటున తన పేరిట వేరే వ్యక్తి భూమి నమోదై పట్టా పుస్తకం వచ్చినా కూడా స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చి నిజాయితీకి మారుపేరుగా నిలిచాడో యువ రైతు. తనది కాని భూమి తనకు వద్దంటూ రెవెన్యూ అధికారులకు అప్పగించాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పొన్నం రాజుగౌడ్కు అదే గ్రామానికి చెందిన బక్క సోమయ్య అనే రైతుకు సంబంధించిన 15 గుంటల భూమి తప్పుగా నమోదైంది. ఇది గమనించిన రాజుగౌడ్ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్ భూక్యా పాల్సింగ్కు విషయం చెప్పాడు. రైతు బక్క సోమయ్య పేరు మీద స్లాట్ బుక్ చేసి శనివారం స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ సందర్భంగా రాజుగౌడ్ను ఉప సర్పంచ్ బక్క నాగరాజుతో పాటు గ్రామస్థులు, రెవెన్యూ అధికారులు అభినందించారు.