హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్రావు అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఖైరతాబాద్లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. కమీషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిషోర్గౌడ్తో పాటు కమిషన్ మెంబర్ సెక్రెటరీ, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం లక్ష్మన్ బాపూజీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడూతూ.. ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. క్విట్ ఇండియా, ముల్కీ వ్యతిరేక ఉద్యమంతో పాటు తెలంగాణ పోరాటంలో కూడా ఆయన కీలక భూమిక పోషించారని పేర్కొన్నారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తుచేశారు. బాపూజీ అణగారిన వర్గాలకు భీష్మ పితామహుడుగా నిలిచారని పేర్కొన్నారు.
‘బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రయం.. ఖచ్చితత్వం, నిర్మొహమాటం ఆయన తత్వం. నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించి హైదరాబాద్ సంస్థానపు పోరాట ఉధృతి స్వభావాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఉద్యమ కెరటం’ అని కొనియాడారు. మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.
కమిషన్ సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్, కిషోర్గౌడ్ మాట్లాడుతూ.. బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, అసిస్టంట్ సెక్రెటరీ రాధిక, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.