నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 29: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన కరడుగట్టిన నేరస్తుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతనిపై 18 చోరీ కేసులతోపాటు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు సైతం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్రీటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని గౌతంనగర్ ప్రాంతంలో ఈ నెల17న తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేపట్టగా సదరు పాత నేరస్తుడి నేరచరిత్ర వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గౌతంనగర్కు చెందిన బేగారి రాజు ఈ నెల 17న తన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి 19వ తేదీన రాగా ఇంటి తాళం ధ్వంసం చేసి ఉండడంతోపాటు ఇంట్లోని బంగారం,వెండి చోరీకి గురైనట్లు గుర్తించి స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్చార్జి సీఐ పుప్పాల శ్రీశైలం ఆధ్వర్యంలో అటాచ్డ్ ఎస్సై, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్తోపాటు లభ్యమైన ఇతర ఆధారాలతో నగరంలోని ఆదర్శనగర్కు చెందిన కందికంటి రాజు గౌడ్ అలియాస్ చిల్లిరాజును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారించారు. సదరు నిందితుడిపై బోధన్ పట్టణ పరిధిలో మర్డర్ ఫర్ గెయిన్, అటెంప్ట్ మర్డర్ కేసులతోపాటు వేర్వేరు పోలీసు స్టేషన్లలో 18 చోరీ కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ సైతం ఉన్నట్లు చెప్పారు.నిందితుడు తాను చేసిన నేరాలను అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రెండు ఇత్తడి దీపాలు,15 రాగి చెంబులు, రెండు చిన్న ఇత్తడి మాణిక్యాలు, మూడు రాగిప్లేట్లు, ఒక రాగి బిందె, రెండు స్టీల్ జగ్గులు, ఒక ఇత్తడి తాంబూలం, నాలుగు స్టీల్ బాగోనెలు, మూడు వెండి బిస్కెట్లు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి చోరీ కేసు సొత్తుతోపాటు నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనం కేసులో 14 గ్రాముల బంగారం గొలుసు,12.9 గ్రాముల బంగారు నెక్లెస్ ,రెండు బంగారు కమ్మలు 10.21 గ్రాములు, నాలుగు బంగారు ఉంగరాలు 7.9 గ్రాములు రికవరీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. నేరాలకు ఉపయోగించిన కారును సైతం సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ శ్రీశైలంతోపాటు అటాచ్డ్ ఎస్సై, సిబ్బంది అఫ్సర్, వెంకట్ రామ్, హోంగార్డు జగన్ను అభినందించారు. వారికి రివార్డు సైతం అందజేయనున్నట్లు ఏసీపీ చెప్పారు.