ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం లేకుండానే 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగానే కొందరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై విమర్శలు మొదలు పెట్టారు. ఈ విమర్శలన్నీ రాజకీయ ఉద్దేశాలతోనే వస్తున్నాయని అర్థమవుతూనే ఉన్నది. ఇప్పుడు విమర్శలు చేస్తున్నవారే గతంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం రాసిచ్చిన డాక్యుమెంటును చదవటం తప్ప గవర్నర్ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని నిందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో కూడా విమర్శలు చేసింది ఈ ప్రతిపక్షాలే.
కొంతకాలం వెనక్కు వెళ్తే కేంద్రంలో, రా ష్ర్టాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండేది. వాళ్లు కోరుకున్న వ్యక్తులే గవర్నర్లుగా నియమితులయ్యేవారు. వేరేపార్టీ అధికారంలో ఉన్నచోట ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను గవర్నర్లే కూలదోసేవారు. అందుకు ఉదాహరణ అప్పట్లోని కేరళలో కాంగ్రెసేతర ప్రభుత్వమే.
అనేక కమిషన్లు
మన ప్రజాస్వామిక సహకార సమాఖ్యలో గవర్నర్ వ్యవస్థ విధులను అర్థంచేసుకోవటానికి అనేక కీలక కమిషన్లను ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయటానికి అవి అనేక సూచనలు చేశాయి. 1968లో పాలనా సంస్కరణల కమిషన్, 1969లో రాజమన్నార్ కమిషన్, 1971లో కమిటీ ఆన్ గవర్నర్స్, 1983లో బెంగళూరులో నిపుణుల సమావేశం, చివరగా 1988లో సర్కారియా కమిషన్ను నియమించారు. ఈ కమిషన్లన్నీ ఎక్కువగానో తక్కువగానో ఒక అంశంలో ఏకీభవించాయి. గవర్నర్ రాష్ట్ర రాజధానిలో ఉండే కేంద్రప్రభుత్వ ఏజెంటు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే దాన్ని కూలదోసి, దేశాన్ని పాలించే పార్టీ ప్రభుత్వాన్ని అందలం ఎక్కించే అవకాశం కోసం గవర్నర్లు ఎదురుచూస్తున్నారని, తద్వారా దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ధ్వంసం చేస్తున్నదని ఈ కమిషన్లు భావించాయి. రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నది గవర్నర్లేనని ఈ కమిషన్లన్నీ అభివర్ణించాయి.
సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవస్థలను సమీక్షించుకోవటంపైనే ప్రజాస్వామ్య చైతన్యం ఆధారపడి ఉన్నది. మన దేశంలో ఈ సూత్రం కనుమరుగైంది. అందుకు గవర్నర్ వ్యవస్థే ఉదాహరణ. రాజ్యాంగ సభలోని సభ్యులంతా అన్ని అంశాల్లాగే దీనిపై కూడా లోతుగా చర్చించారు.
గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో గవర్నర్ వ్యవస్థ అవసరమా కాదా? అది ఎందుకోసం? అన్నదానిపై చర్చ జరుగుతూనే ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు రోజూ ఆ వ్యవస్థ వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లక్రితం తమిళనాడులో ఈకే పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంలో నాటి రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ ఎలాంటి పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. దేశానికి గవర్నర్ వ్యవస్థ అవసరమైనప్పటికీ దాని నిర్మాణాన్ని సమీక్షించటమూ అవసరమే. రాజ్యాంగంలో పేర్కొన్నట్టు సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో ఆ వ్యవస్థ పాత్రను సమీక్షించాల్సిన అవసరం ఉన్నది.
వలసపాలన కాలపు అవశేషం
గవర్నర్ల పాత్రపై 1949లో రాజ్యాంగ సభలో వాడివేడి చర్చ జరిగింది. హెచ్వీ కామత్, కేటీ షా, రోహిణికుమార్ చౌదరి, బిశ్వనాథ్ దాస్ తదితర సభ్యులు గవర్నర్ అధికారాలపై విమర్శలు చేశారు. ఆ పదవి వలసపాలన కాలపు అవశేషమని పేర్కొన్నారు. అది జవాబుదారీతనం లేని, ‘గడబిడ సృష్టించే సామర్థ్యం కలిగిన పదవి’ అని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ వలసపాలన కాలంలో ఒడిశా ప్రధానిగా, తర్వాతి కాలంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన దాస్ గవర్నర్ పదవిని తీవ్రంగా వ్యతిరేకించినవారిలో ఒకరు. గవర్నర్ను కేంద్రం నియమించడం, మరీముఖ్యంగా పరిపాలనాపరమైన చికాకులు సృష్టించే అధికారం ఆ పదవికి ఉండడం వలన విపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రంలో అతడు లేదా ఆమె ఆమోదయోగ్యత కలిగి ఉండకపోవచ్చని ఆయన ముందుగానే ఊహించారు.
దీనికి రాజీ ప్రతిపాదనగా బీఆర్ అంబేడ్కర్ ప్రాంతీయ శాసనసభలు లేదా రాష్ర్టాల శాసనసభలు ఎన్నుకున్న ప్యానెల్ సభ్యుల్లో ఒకరిని గవర్నర్గా నియమించాలని సూచించారు. అయితే ఆ సూచనకు రాజ్యాంగంలో చోటు దక్కలేదు. తదనంతర కాలంలో రాష్ర్టాలు నియమించిన పలు కమిషన్లు గవర్నర్లను నియమించే విధానంపై పలు సూచనలు చేశాయి. గవర్నర్ల నియామకం కేంద్ర నిర్ణయాధికార పరిధిలోనే ఉండాలని, అయితే సంబంధిత రాష్ర్టాల ముఖ్యమంత్రులను సంప్రదించిన తర్వాతే నియామకం జరపాలని 1969లో మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్ సిఫారసు చేసింది. ఇటీవలి కాలంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ప్రముఖ వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలని కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ 1988లో సిఫారసు చేసింది.
గవర్నర్ విధులు, బాధ్యతల గురించి అంబేడ్కర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గవర్నర్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అని ఆయన తెలిపారు. ఒక వర్గానికి గవర్నర్ పక్షపాతధోరణితో వ్యవహరిస్తే ఈ నిర్వచనంలో కొంత సందిగ్ధత ఏర్పడవచ్చని అంబేడ్కర్ అనుమానించారు. కేంద్రప్రభుత్వం, గవర్నర్లపై అంబేడ్కర్ నమ్మకం వమ్ము అయ్యే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నియమించిన గవర్నర్లు ఈ రోజుల్లో ఒకపార్టీకి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. కేంద్రప్రభుత్వంలో కొత్తపార్టీ అధికారంలోకి రాగానే గతపార్టీ నియమించిన గవర్నర్లు రాజీనా మా చేయాల్సిన పరిస్థితే దీనికి నిదర్శనం. అందుకే గవర్నర్లు పక్షపాతపూరితంగా తీసుకొన్న నిర్ణయాలపై అసెంబ్లీలో చట్టసభ సభ్యులు నిలదీస్తున్నారు.
అధికారాన్ని దుర్వినియోగపరుచడం
రాజ్భవన్ అధికారాలను దుర్వినియోగం చేసిన గవర్నర్ల సంఘటనలు కోకొల్లలు. 1989లో కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మై (జనతాదళ్) ప్రభుత్వాన్ని అప్పటి గవర్నర్ రద్దు చేశారు. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన తమ ప్రభుత్వాన్ని ఫ్లోర్ టెస్టుకు అనుమతించాలని, అప్పుడు తమ బలాన్ని నిరూపించుకొంటామని పేర్కొన్న బొమ్మై విజ్ఞప్తిని కూడా ఆ గవర్నర్ తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీరామారావు ప్రభుత్వం, గోవాలో విల్ఫ్రెడ్ డిసౌజా సర్కారును కూడా ఇదే పక్షపాతవైఖరితో గవర్నర్లు కూల్చేసిన ఘటనలు తెలిసినవే. ఇక, ఉత్తరప్రదేశ్ గవర్నర్ రమేశ్ భండారీ ధోరణిపై సుప్రీంకోర్టు కూడా ఆక్షేపణ వ్యక్తం చేసింది. కర్ణాటకలో రాజకీయ అస్థిరత ఏర్పడినప్పుడు.. మెజారిటీ సీట్లు వచ్చిన పార్టీలను వదిలేసి అక్కడి గవర్నర్ కనీస మెజారిటీ లేని ఒక పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. అంతేనా, బలాన్ని నిరూపించుకొనేందుకు కొంత సమయం కూడా ఇచ్చారు. అయితే, కోర్టు జోక్యంతో ఆ విషయం సద్దుమణిగింది. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేరళ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించి, ఆ ప్రసంగంతో తనకు ఏ సంబంధం లేదని పేర్కొంటూ ముగించటం గమనార్హం. ఇక, బెంగాల్ గవర్నర్ అయితే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే, ప్రభుత్వ అనుమతి లేకుండా సమావేశాలు ముగిశాయని ప్రకటించారు. ఇవన్నీ గవర్నర్ వ్యవస్థపై చర్చించాల్సిన అవసరాన్ని తెలియజేస్తుది. దీనిపై సమగ్రస్థాయిలో మదించి, చర్చించి, సరైన పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవస్థలను సమీక్షించుకోవటంపైనే ప్రజాస్వామ్య చైతన్యం ఆధారపడి ఉన్నది. మన దేశంలో ఈ సూత్రం కనుమరుగైంది. అందుకు గవర్నర్ వ్యవస్థే ఉదాహరణ. రాజ్యాంగ సభలోని సభ్యులంతా అన్ని అంశాల్లాగే దీనిపై కూడా లోతుగా చర్చించారు.
(వ్యాసకర్త: సీనియర్ పాత్రికేయులు)
– విజేఎం దివాకర్