తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరమే జానపద, గిరిజన పాటలకు సముచిత స్థానం దక్కిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు ఆర్.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహాకారంతో నృత్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లేష్ తల్వార్ సేకరించిన తెలంగాణ ప్రజల సామెతలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ భాషకు, యాసకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవం ఇస్తున్నారని అన్నారు.
తెలంగాణ సామెతలను సుమారు 4వేలకు పైగా సేకరించి పుస్తక రూపంలోకి తీసుకువచ్చి తెలంగాణ సమాజానికి చేరువచేయడం అభినంధించదగిన విషయమన్నారు. ఐఏఎస్ అధికారి రాజర్శి షా మాట్లాడుతూ ఈ పుస్తకం ద్వారా తెలుగు భాషను నేర్చుకోవడం ఇతర భాషల వారికి ఎంతో సులువన్నారు. మల్లేష్ ప్రభుత్వ అధికారిగా నిత్యం ఒత్తిడితో ఉన్నప్పటికీ ఆసక్తితో కళల పట్ల తనకున్న తపనతో తెలంగాణ ప్రజల సామెతలను ఒక్క దగ్గరికి చేర్చి పుస్తకంగా రూపొందించడం గొప్ప విషయమన్నారు.
కళాకారుడిగా, జర్నలిస్టుగా పనిచేసిన మల్లేషం సాహిత్యం పట్ల, శాస్త్రీయ నృత్య కళల పట్ల మక్కువతో తెలుగువిశ్వవిద్యా లయం నుండి జానపద సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందడంతో పాటు తెలంగాణ సామెతలను సేకరించి పుస్తక రూపంలో తీసుకురావడం గర్వకారణమని గ్రామీణాభివృద్ది శాఖ సంగారెడ్డి డైరక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా గుమ్మడి ఉజ్వలకు నృత్యభారతి పురస్కారం అందజేసి సత్కరించారు.
కళాకారులు గుమ్మడి ఉజ్వల, సంధ్య, ఒగ్గు ప్రవీణ్లు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. దక్షిణ మధ్య క్షేత్రియ సాంస్కృతిక కేంద్రం, భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యక్రమ కమిటీ సభ్యులు విశ్వకర్మ డి.ఆర్.కె, డాక్టర్ మల్లేషం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.